కరుణకు ఝలక్: నితీష్‌కు వల, సందిట్లో మమతాబెనర్జీ

Nitish Kumar - Mamatha Banerjee - Alagiri
న్యూఢిల్లీ: యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన డిఎంకె అధినేత కరుణానిధికి కాంగ్రెసు పార్టీ గట్టి షాక్ ఇచ్చే ప్రయత్నాల్లో మునిగిపోయిందట. డిఎంకె మద్దతు ఉపసంహరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రధాన రాజకీయ పార్టీలు ఎస్పీ, బిఎస్పీలు బయటి నుండి మద్దతిస్తున్నాయి. అవి ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది.

ప్రభుత్వానికి ఇబ్బంది లేకున్నప్పటికీ తమను చిక్కుల్లో పడేసిన కరుణానిధికి ఝలక్ ఇచ్చేలా ఆయన మరో తనయుడు అళగిరికి అధికార పార్టీ గాలం వేసినట్లుగా ప్రచారం సాగుతోంది. కరుణ తర్వాత డిఎంకె అధ్యక్ష పీఠం విషయంలో అళగిరి, స్టాలిన్‌ల మధ్య విబేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అవి తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా, అళగిరి అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నాల్లో అధికార పార్టీ చేపట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అళగిరి ఇప్పటికే రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెసు మాత్రం ప్రయత్నాలు మానలేదట. అయితే, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, తమ పార్టీ అధిష్టానం మేరకే నడుచుకుంటామని అళగిరి చెబుతున్నారు.

నితీష్‌కూ వల

ఎన్డీయేలో ఉన్న జెడి(యు) పైనా కాంగ్రెసు పార్టీ కన్నేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ప్రధాని అభ్యర్థిగా జెడి(యు) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విబేధిస్తున్నారు. మోడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన ఎన్డీయేకు రాం రాం చెప్పనున్నారు. అంతేకాకుండా నితీష్ ప్రధాని మన్మోహన్ సింగ్ పైన ఇటీవల ప్రశంసలు కురిపించారు. దీంతో జెడి(యు)ను తమ వైపుకు లాక్కునే ప్రయత్నాలు కాంగ్రెసు చేస్తోంది.

జెడి(యు)ను ప్రసన్నం చేసుకునేందుకు బీహార్ ప్రభుత్వం పలు డిమాండ్లను ఒప్పుకునేందుకు సిద్ధపడుతోందట. నితీష్ డిమాండ్ ప్రకారం.. ఆయన పాలనలోని బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని నియమించాలని అధిష్టానం నిర్ణయించిందట.

దీనిపై నితీష్ స్పందిస్తూ.. ప్రభుత్వం ఎంతోకొంత ముందడుగువేస్తోందని ఈ భేటీల ద్వారా తెలిసిందని, వారు ముందడుగు వేస్తే.. అది చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఎన్డీయే మిత్ర పక్షాల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తు గురించి ఎవరికీ తెలియదన్నారు. మరోవైపు యూపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం లేదని, మధ్యంతర ఎన్నికలకు అవకాశం లేదని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ చెప్పారు.

కేంద్రంపై మమత మండిపాటు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై బుధవారం నిప్పులు చెరిగారు. బెంగాలుకు రావాల్సిన నిధులను కేంద్రం సకాలంలో అందించడం లేదని, కేంద్రం బెంగాల్ ఆర్థిక పరిస్థితితో రాజకీయం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రజల విశ్వాసంతో తాము ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, మీలా రాజకీయాలు చేయడం తమకు తెలియదని కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. కేంద్రం ఓ వైపు సంక్షోభంలో కొట్టిమిట్టాడుతుంటే సందట్లో సడేమియాలాగా మమతా బెనర్జీ విరుచుకు పడటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+