నిర్భయ లా ప్రకారం దేశంలో సంగారెడ్డి కోర్టు తొలి తీర్పు
నిందితుడు అత్యాచారం కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఈ కేసుపై విచారణ జరిపిన సంగారెడ్డి కోర్టు శుక్రవారం నిందితుడు యాదవ్కు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. నిందితుడి పైన ఐడిఏ బొల్లారం పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. నిందితుడి స్వస్థలం బీహార్. ఇతని వయస్సు ఇరవై రెండు.
ఇటీవల నిర్భయ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. మొదట ప్రవేశ పెట్టిన చట్టానికి ప్రతిపక్షాలు కొన్ని సవరణలు సూచించాయి. ప్రతిపక్షాల సూచనల మేరకు ఈ చట్టాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం అనంతరం ఇటీవలే మరోసారి సభలో నిర్భయ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ఈ చట్టానికి సభ ఆమోదం తెలిపింది. చట్టం ఆమోదం పొందిన తర్వాత సంగారెడ్డి కోర్టు నిర్భయ చట్టం ఆధారంగా దేశంలోనే తొలిసారి తీర్పు చెప్పింది.
కాగా, గతేడాది డిసెంబర్ 16వ తేదిన నిర్భయపై కదులుతున్న బస్సులోనే సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు నిర్భయపై అత్యాచారాన్ని ఖండిస్తూ రోడ్డెక్కారు. ఆమెకు ప్రభుత్వమే చికిత్స అందించింది. మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కూడా తీసుకు వెళ్లింది. నిర్భయ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మృతి తర్వాత ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకు వచ్చింది.