నల్లమల అడవుల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో కీలకఅడుగు..శ్రీశైలం జర్నీ బేఫికర్!
నల్లమల అడవులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల వెంబడి విస్తరించి ఉన్న ప్రసిద్ధ వన్యప్రాణి అభయారణ్యం. ఇక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, ఘాట్ రోడ్డు పరిమితుల వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక వినూత్న ప్రాజెక్టును చేపట్టాయి.
జాతీయ రహదారి-765పై ఎలివేటెడ్ కారిడార్
పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు జాతీయ రహదారి-765పై ఎలివేటెడ్ కారిడార్ ఎత్తైన రహదారిని నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వన్యప్రాణుల సంచారానికి ఎలాంటి అంతరాయం కలగకుండా, భక్తులు 24 గంటలూ సురక్షితంగా ప్రయాణించే వెసులుబాటు ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం ఘాట్ రోడ్డులో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వాహనాలు అనుమతిస్తున్నారు.

నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ఎలివేటేడ్ కారిడార్
రాత్రి సమయంలో వన్యప్రాణుల సంచారం కారణంగా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. పైన రహదారి, కింద వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరగడానికి వీలు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వైపు పెద్దా దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39కి.మీ, తెలంగాణ వైపు బ్రహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35కి.మీ,మొత్తం సుమారు 86.74కి.మీ. దూరంలో ఈ ఎత్తైన వంతెన నిర్మించనున్నారు.
జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది త్వరలోనే పనులు
ఈ ఎలివేటేడ్ కారిడార్ ను స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అడవి భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా తుమ్మలబైలు, చిన్నారుట్ల ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉన్నందున వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు.
శ్రీశైలం యాత్రికులకు సౌకర్యం.. వన్య ప్రాణులకు రక్షణ
ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తి అయితే , శ్రీశైలం యాత్రికులకు సౌకర్యం పెరుగుతుంది. అదే సమయంలో నల్లమల అడవుల్లోని వన్యప్రాణుల జీవనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ఇది పర్యావరణ రక్షణకు దోహదం చేస్తుంది.నల్లమల వన్యప్రాణి అభయారణ్యం దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద అటవీ ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ పులులు, చిరుతలు, ఎన్నో జాతుల పక్షులు, జంతువులు స్వేచ్ఛగా విహరిస్తాయి. ఈ సున్నితమైన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం కీలకం. ఈ ప్రాజెక్టు ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు.













Click it and Unblock the Notifications