కటకటాలు: కోదండరామ్, గౌడ్లపై సస్పెన్షన్ వేటు?
పోలీసులు ఉద్యమకారులతోపాటు కోదండరామిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్లను కూడా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సడక్బంద్లో భాగంగా మొత్తం 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో 147,148,341, 188, 427,109, రెడ్ విత్ 149తోపాటు పీడీపీపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. అయితే అందరితోపాటు కేసులు నమోదైన ప్రభుత్వ ఉద్యోగులు కోదండరామిరెడ్డి, శ్రీనివాస్గౌడ్లు కూడా ఆలంపూర్ న్యాయస్థానంలో శుక్రవారంనాడు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా జడ్జి వీరి బెయిల్ పిటీషన్ను తిరస్కరించారు.
విచారణ పూర్తి కాక పోవడం, కేసులు నమోదైన 11 మందిలో ముగ్గురు ఇంకా పరారిలోనే ఉండడంతో బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కోదండరామిరెడ్డి, శ్రీనివాస్గౌడ్లపై క్రమశిక్షణ వేటు పడే అవకాశం ఏర్పడింది. ‘ఏపీ సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్ కంట్రోల్ యాక్ట్ (1991) రూల్ 8 ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగయినా 48 గంటలకు మించి జ్యుడీషియరీ రిమాండ్లో ఉంటే ఆ ఉద్యోగి ప్రభుత్వ సేవల నుంచి సస్పెండ్ అయినట్లుగా పరిగణిస్తారు. అదే ఉద్యోగి చేసిన నేరం రుజువైతే ఉద్యోగం నుంచి డిస్మిస్ అవుతారు.
గతంలో శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఒకరు ఒక నేరం కింద అరెస్టయి ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడంతోపాటు సదరు నేరం రుజువు కావడంతో ఉద్యోగం నుంచి డిస్మిస్ కూడా అయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణా సడక్బంద్లో అరెస్టయిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి, మున్సిపల్ శాఖ ఉద్యోగి శ్రీనివాస్గౌడ్ల పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.