జగన్ కేసులో తుదిఛార్జీషీట్ జాప్యం: కెవిపిని విచారించాకే
కెవిపి నుంచి కీలకమైన సమాచారం రాబట్టి తుది చార్జిషీటును పకడ్బందీగా రూపొందించాలని సిబిఐ భావిస్తోంది. తుది ఛార్జీషీటు ఎప్పుడు దాఖలు చేస్తారని సిబిఐ అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణను అడిగితే... జగన్ అక్రమాస్తుల కేసులో నెలాఖరులోపు తుది ఛార్జీషీటు అనేది మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే అని చెప్పారు. ఈ విషయంలో తమకు సుప్రీం కోర్టు ఎలాంటి గడువు విధించలేదన్నారు.
కావాలంటే కోర్టు వెబ్సైట్లో రూలింగ్ చూసుకోవచ్చని సూచించారు. కెవిపి విచారణ ముగిసిన అనంతరం దిల్కుషా గెస్ట్హౌస్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. కెవిపిని 160 సిఆర్పిసి సెక్షన్ కింద నిలిపించి ప్రశ్నించామన్నారు. ఏదైనా కేసుకు సంబంధించిన అవగాహన ఉన్న వారి నుంచి సమాచారం తెలుసుకునేందుకు ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తామని, అలాగే జగన్ అక్రమాస్తుల కేసులో కెవిపిని పిలిపించామని చెప్పారు.
ఆయన చెప్పిన వివరాలను, మా వద్ద ఉన్న సమాచారంతో క్రోడీకరించుకుని అవసరమైతే ఆయనను మళ్లీ పిలుస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి కొన్ని వివరాలు అందాయని, మరికొన్ని రావాల్సి ఉందని చెప్పారు. కొత్తగా ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని జేడీ స్పష్టం చేశారు.