బొత్స పిసిసికి డిఎస్ ఎర్త్, మరో ఇద్దరు పోటీ?
డిఎస్ పనితీరుపై, వ్యవహారశైలిపై కాంగ్రెసు అధిష్టానానికి మంచి గురి ఉంది. ఆయనకు అధిష్టానం వద్ద మంచి పలుకుబడి కూడా ఉంది. పైగా, రాష్ట్రంలో రెండోసారి వైయస్ రాజశేఖర రెడ్డితో కలసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్న సానుభూతి డిఎస్పై అధిష్టానానికి ఉంది. గతంలో అధిష్టానం ముందుకు వచ్చినా ఆయన ఆనాసక్తి ప్రదర్శించారు. తాను గతంలోనే రెండుసార్లు ఆ పదవి నిర్వహించానని, తన సేవలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అభ్యర్ధించారు. ఆ సందర్భంగా బీసీలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని సోనియాను కలిసి అభ్యర్ధించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బీసీ అయిన డిఎస్కు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ప్రాంతాల మధ్య సమీకరణలు పాటించినట్టవుతుందన్న అంచనా కూడా లేకపోలేదని అంటున్నారు. దానికితోడు వివాదరహితుడిగా ఉన్న ముద్ర, ముఖ్యమంత్రితో సర్దుకుపోయే తత్వం కూడా ఆయనకు కలసివస్తుందని చెబుతున్నారు. పిసిసి రేసులో సీనియర్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే ముందు వరసలో ఉన్నారు. కాపు కోటాలో ఆయనకు పిసిసి చీఫ్ పదవి ఇవ్వడం ద్వారా బలమైన కాపు సామాజికవర్గాన్ని పూర్తి స్థాయిలో పార్టీ వైపు మళ్లించుకోవచ్చనే ఆలోచన లో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఆయనకు ముఖ్యమంత్రి సహకారం లేకపోయినా, వ్యతిరేకంగా మాత్రం లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాపులకు ముఖ్యమంత్రి లేదా పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని రాష్ట్ర కాపునాడు కోరుతోంది. ఈ నేపథ్యంలో కన్నాకు పిసిసి పదవి ఇవ్వడం ద్వారా, ఆ సామాజికవర్గాన్ని సంతృప్తిపరచవచ్చని నాయకత్వం భావిస్తున్నట్లు చాలాకాలం నుంచీ ప్రచారంలో ఉంది.ఇప్పుడు కొత్తగా డీఎస్తో పాటు యువ నేత, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేరు కూడా తెరపైకి వచ్చారు.
బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య ఉన్న వైరుధ్యాలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేయవచ్చుననే అంచనాకు పార్టీ అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. దానికితోడు, కాపు సామాజిక వర్గం పూర్తి స్థాయిలో బొత్సను తనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. ఈ స్థితిలో బొత్సను మంత్రి పదవికి పరిమితం చేస్తే బాగుంటుందనే ఆలోచన సాగుతున్నట్లు చెబుతున్నారు. రెండు నెలల్లో బొత్స సత్యనారాయణ భవిష్యత్తు తేలనుంది.