తెలంగాణ: జైపాల్, జానా రిజైన్ యోచన, అనుమానం
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది. రాజీనామా అంశంపై జైపాల్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేసిన అనంతరం తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాలని జైపాల్ రెడ్డికి ఎంపీలు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే, అందుకు తన ఆరోగ్యం సహకరించదని ఆయన చెప్పారట. అయితే, మంత్రి పదవికి రాజీనామా చేసే ఆయన కాంగ్రెసులోనే కొనసాగాలని చూస్తున్నారట. అదే సమయంలో 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమానికి తాను నాయకత్వం వహించకున్నా పూర్తి సహకారం అందిస్తానని ఆయన ఎంపీలకు చెప్పారట. మే నెలాఖరులోగా తెలంగాణపై తేల్చాలని తెలంగాణ ప్రాంత ఎంపీలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. మే నెలలోగా తేల్చకుంటే రాజకీయ సమీకరణాలు మారుతాయని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
సాధారణ ఎన్నికలకు మరెంతో సమయం లేనందున తెలంగాణ ప్రాంత ఎంపీలు ప్రత్యేక రాష్ట్రంపై జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జైపాల్ రెడ్డి, జానా రెడ్డిలతో పాటు మంత్రులు, అధికార పార్టీ తెలంగాణ నేతలను తెలంగాణవాదులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణవాదులు మరింత టార్గెట్ చేసుకుంటే పరిస్థితి విషమిస్తుందని భావించినందువల్లే జానా, జైపాల్లు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది.
అనుమానాలన్న జానా!
తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెసు మీద జానా రెడ్డి అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అధిష్టానం తెలంగాణ ఇస్తుందనే నమ్మకం లేదని, వస్తే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపే తెలంగాణపై కేంద్రం నుండి ప్రకటన వస్తుందని, అందుకోసం ఒత్తిడి చేస్తున్నామని, తమ ప్రయత్నాలు ఫలించనప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని జానా రెడ్డి చెప్పారు.