జగన్ ఎమ్మెల్యేలపై కిరణ్ కౌంట్!, వైయస్పై మళ్లీ: టిడిపి
సోమవారం విద్యుత్ సమస్యపై స్వల్పకాలిక చర్చకు సభలో స్పీకర్ అనుమతించారు. ఈ సందర్భంగా టిడిపి నేత పయ్యావుల కేశవ్ మాట్లాడారు. విద్యుత్ సమస్యతో రాష్ట్రం అల్లాడుతోందని, పరిశ్రమలు మూతపడే పరిస్థితి వస్తోందన్నారు. విద్యుత్ వైర్లు కాకుండా బిల్లు ముట్టుకుంటేనే షాక్ ఇస్తోందన్నారు. కరెంట్ లేకుంటే దోమలతో, కరెంట్ ఉంటే బిల్లులతో ప్రజలకు నిద్ర పట్టడం లేదన్నారు. బతకడం కోసం బందులు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నారు.
విద్యుత్ కోసం పోరాడితే జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. చిన్న పరిశ్రమల యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ సమస్యకు కిరణ్ ఒక్కరే కారణం కాదని, మాజీ ముఖ్యమంత్రులు కొణిజేటి రోశయ్య, వైయస్ రాజశేఖర రెడ్డిలు కూడా కారణమే అన్నారు. ఎవరి వల్ల రాష్ట్రం ఈ దుస్థితిలో ఉందో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ అడిగితే ప్రకృతి కారణంగా ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చేతులు దులుపుకోవడం శోచనీయం అన్నారు.
బషీర్ బాగ్ కాల్పులు తాము దురదృష్టకరమని ఎప్పుడో చెప్పామని కానీ ముదిగొండ తదితర కాల్పులకు ప్రభుత్వం ఏం చెబుతుందన్నారు. తాము వాస్తవాలే మాట్లాడుతున్నాం తప్ప అబద్దాలు కాదన్నారు. పవర్ సెంటర్ ఎక్కడుందో కిరణ్కు తెలుసునన్నారు. ఢిల్లీకి వెళ్లి అడిగితే పవర్ వస్తుందన్నారు.
కిరణ్ వర్సెస్ పయ్యావుల
పయ్యావుల విమర్శలు చేస్తుండగా ముఖ్యమంత్రి లేచి.. పయ్యావుల చక్కగా మాట్లాడుతారని కాని, విమర్శలు కాకుండా సలహాలు ఇస్తే మంచిదని సూచించారు. సూచనలు ఇవ్వకుండా విమర్శలు చేస్తే లాభమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి కూడా విమర్శలు కాకుండా సూచనలు ఇవ్వాలని టిడిపికి సూచించారు.
విమర్శలు లేకుండే నిద్రిస్తారు
ప్రధాన ప్రతిపక్షమైన తాము విమర్శలు చేయకుండా కేవలం సలహాలు ఇచ్చి వెళ్లిపోతే అది సరికాదని, అలా చేస్తే ప్రభుత్వం నిద్ర పోతుందని పయ్యావుల అన్నారు. విమర్శలు చేస్తూనే సలహాలు ఇస్తామన్నారు. విమర్శల చేసినప్పుడల్లా అధికార పార్టీ నేతలు అడ్డుకోవడం సరికాదన్నారు. విమర్శలు చేయవద్దని చెప్పడం సరికాదన్నారు. విద్యుత్ లేకుంటే కిటీకీలు తెర్చుకోవాలని సూచిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కిటీకీలు తెర్చుకుంటే దోమలు, దోపిడీలు జరుగుతున్నాయన్నారు. దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలనేది కాంగ్రెస్ ట్యాగ్ లైన్ అని ఎద్దేవా చేశారు. నేతలు, ఉద్యోగులు విద్యుత్ పొదుపు పాటించకుండా ప్రజలను పాటించమని చెప్పడమేమిటన్నారు. సోనియను కొవ్వొత్తులు, రాహుల్ గాంధీని విసనకర్రలు పంపిణీ చేయమనాలని ఎద్దేవా చేశారు. గేదెను ముల్లు కర్రతో పొడిచినట్టు ప్రభుత్వాన్ని తాము కదిలిస్తామన్నారు.
కాంగ్రెసు అధికారంలోకి వచ్చే నాటికి గుజరాత్ రాష్ట్రం మనకంటే వెనుక ఉండేదని, ఇప్పుడు ఆ రాష్ట్రం విద్యుత్లో ముందంజలో ఉందన్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి తాను నడుస్తుంటే గంగమ్మ తల్లి పారినట్లుగా చెప్పుకున్నారని, ఇప్పుడు కిరణ్ కూడా తన హయాంలో కిరణాలు ఉదయిస్తున్నాయని చెబుతున్నారని కాని, గ్రామీణులకు కూడా విద్యుత్ ఇవ్వాలని కోరారు. గ్రామాలకు తక్కువ విద్యుత్ పట్టణాలకు ఎక్కువ విద్యుత్ ఈ బేధాలు ఎందుకని ప్రశ్నించారు. డిస్కంలను దివాళా తీయించిన ఘనత వైయస్ దే అన్నారు.