వైయస్ మీద సర్వే 'కుక్కచావు'పై జగన్ పార్టీ నిప్పులు
వైయస్ మరణంపై నీచంగా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. మాజీ ప్రధానమంత్రిలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై మాట్లాడటానికి తమకు సంస్కారం అడ్డొస్తుందన్నారు. ఇంకా ఏమైనా పదవులు కావాలంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లు పట్టుకొని భజన చేసుకోవాలే తప్ప వైయస్ను విమర్శిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సర్వేకు దమ్ముంటే రాజీనామా చేసి సోనియా బొమ్మతో గెలవాలని సవాల్ చేశారు. తాము వైయస్ బొమ్మతో పోటీ చేస్తామని, ప్రజలు ఎవర్ని గెలిపిస్తారో చూద్దామన్నారు.
కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి మృతి పైన కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రజా సేవ చేయాలని చెప్పి వైయస్ రాజశేఖర రెడ్డిని సోనియా గాంధీ ముఖ్యమంత్రిని చేసిందని, అయితే వైయస్ ప్రజా ధనాన్ని దోచుకుని పాపపు పనులు చేశాడని, అందుకే కుక్క కంటే హీనంగా చనిపోయాడని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టిన ప్రజాధనం, అక్రమాలను చూస్తుంటే అసలు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో పుట్టడం దురదృష్టకరమని భావిస్తున్నానని సర్వే అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకం ఘనత వైయస్ది కాదని, అది సోనియా, కాంగ్రెస్ పార్టీ ఘనత మాత్రమేనని చెప్పారు. సోనియా గాంధీ దయాదాక్షిణ్యాలతో వైయస్ రాజశేఖరెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని, కానీ ఐదు దశాబ్దాల్లో కాంగ్రెస్లో ఏ ఒక్క నేత సంపాదించుకోలేనంత డబ్బును ఐదేళ్లలోనే ఆయన దోచుకున్నారని, దోచుకోవడానికి ఇప్పుడు జగన్ తహతహలాడుతున్నారని ధ్వజమెత్తారు. జైలు ఊచలు లెక్కబెడుతున్న జగన్ గజదొంగ అని, ఆయన పాపపు పనుల్లో, అవినీతి సొమ్ములో భాగం పంచుకున్న ఆలీబాబా వంటి వారంతా ఆయన పార్టీలోకి వెళుతున్నారని విమర్శించారు.