వైయస్: టిడిపి వర్సెస్ జగన్ పార్టీ, కిరణ్ 'గీతా'బోధ
వైయస్ హయాంను ఆయన తప్పు పట్టారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెసు నేత శ్రీకాంత్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ నాయకుడిపై ఇలాంటి ఆరోపణలు టిడిపికి సరికాదన్నారు. 2004-09 వరకు పాలన అందరికీ తెలుసునని, ఆ తర్వాత పాలన కూడా తెలుసునని అన్నారు. వైయస్ ఓసారి బాగా పాలించాడు కాబట్టే ప్రజలు ఆయనను గెలిపించారన్నారు. వైయస్ పైన చేసే విమర్శలకు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. దానికి, పయ్యావుల మాట్లాడుతూ... తాను వైయస్ను వ్యక్తిగతంగా ఎక్కడా తప్పు పట్టలేదని, మొదట కిరణ్ను ఆ తర్వాత వైయస్ పాలన లోపాలు చెబుతున్నానని అన్నారు.
అయితే, పయ్యావుల విద్యుత్ సంక్షోభానికి 2004-09 మధ్య పాలన కూడా కారణమని గట్టిగా చెప్పారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధీటుగా స్పందించలేదనే చెప్పవచ్చు. అందుకు గతంలోని అనుభావాలే కారణం కావచ్చంటున్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో విపక్షాల వైయస్ రాజశేఖర రెడ్డిని తప్పు పట్టినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డుకోబోయి చతికిలపడింది!
పయ్యావుల విద్యుత్ సమస్యలపై మాట్లాడుతూ... ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వైయస్ నిర్ణయాలు విద్యుత్ సంక్షోభానికి కారణం అన్నారు. విద్యుత్ సమస్యపై దేవుడే దిక్కు అంటే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. టిడిపి ఎప్పుడూ ప్రజల పక్షమే అన్నారు. తొమ్మిదేళ్ల పాలన పాపం ప్రజలను వెంటాడుతోందన్నారు. భూమి, బొగ్గు, బూడిద మనదైతే కరెంట్ మాత్రం ఇతర రాష్ట్రాలకు పోతోందన్నారు.
'కాగ్' రగడ
విద్యుత్ సమస్యపై కాగ్ నివేదికను పయ్యావుల ప్రస్తావించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేచి.. కాగ్ అంటే భగవద్గీతో, ఖురానో, బైబిలో కాదన్నారు. కాగ్ నివేదికపై పిఏసి నివేదిక ఇస్తుందన్నారు. ఇతర ప్రాజెక్టుల కన్నా జెన్ కో ధర ఎక్కువని కాగ్ నివేదిక ఇచ్చిందన్నారు. ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తాను కాగ్ను తప్పు పట్టడం లేదని కిరణ్ చెప్పారు. అయితే, విశ్లేషణ చేశాకే ఓ అంచనాకు రావడం కుదురుతుందన్నారు.
మధుగాన్కు ఎందుకిచ్చారు?
ప్రభుత్వం విద్యుత్ను అమ్ముకుంటోందని పయ్యావుల విమర్శించినప్పుడు మంత్రి శ్రీధర్ బాబు లేచి.. ప్రభుత్వం విద్యుత్ అమ్ముకున్నదని పదే పదే చెప్పడం సరికాదన్నారు. టిడిపి హయాంలో మధుకాన్ కంపెనీకి ఎందుకు అమ్ముకున్నారని, దానిపై కేశవ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దానికి పయ్యావుల మాట్లాడుతూ.. కాంగ్రెసు ప్రభుత్వం పక్క వారికి అమ్ముకుంటే.. టిడిపి హయాంలో మధుకాన్కు అమ్మింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని వివరణ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ప్రకటనపై కూడా కాసేపు రగడ జరిగింది.
కాంగ్రెసు ప్రభుత్వంలోనే వైయస్
వైయస్ రాజశేఖర రెడ్డి పైన పయ్యావుల విమర్శలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి తప్పు పట్టినప్పుడు టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి లేచి.. పయ్యావుల మాట్లాడటంలో తప్పేముందని, కాంగ్రెసు హయాంలోనే వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నారని అలాంటప్పుడు కాంగ్రెసును, వైయస్ను ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు. పాపాలకు, శాపాలకు అంతా వైయస్ కారణం అన్నారు.