మొదటి భార్యకు నిత్య పెళ్లి కొడుకు బెదిరింపు మెయిల్స్
సంతోష్ గతంలో ఆదాయపు పన్ను శాఖలో ఎల్డి క్లర్కుగా పని చేశాడు. సంతోష్ కుమార్కు 1985లో తెల్మా అనే మహిళతో వివాహం అయింది. కొడుకు పుట్టాక అదనపు కట్నం కోసం ఆమెను వేధించాడు. ఎస్బిఐకు సంబంధించిన రు.4 లక్షలు కాజేసిన కేసులో సంతోష్ కుమార్ నాయుడును 1991లో అబిడ్స్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు. భార్య విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తనకు ఇంకా పెళ్లి కాలేదని ఓ మ్యాట్రీమొనీలో తప్పుడు సమాచారం ఇచ్చాడు. తాను యుకెలో ఇంజనీర్ని అని పేర్కొన్నాడు. రాజస్థాన్కు చెందిన రచనా వ్యాస్ను 2003లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అదనపు కట్నం కోసం ఆమెను కూడా వేధించసాగాడు.
ఇతను తప్పుడు సమాచారం ద్వారా లండన్ కూడా వెళ్లి తిరిగి వచ్చాడు. ఎస్బిఐలో నాలుగు లక్షల రూపాయల కేసు హైకోర్టులో పెండింగులో ఉంది. కేసు కోర్టులో పెండింగులో ఉండగా అతను లండన్ వెళ్లి రావడంపై పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాజస్థాన్ అధికారులను తప్పుదోవ పట్టించి అతను లండన్ వెళ్లి వచ్చాడు. అతను తిరిగి వచ్చాక రెండో భార్యతో కలిసి ఉంటుండగా.. అతని గురించి రెండో భార్యకు తెలిసింది.
పాసుపోర్టు ద్వారా అతనికి మొదటి భార్య ఉందని తెలుసుకుంది. రెండో భార్యతో తన పెళ్లి పెటాకులు చేయడానికి మొదటి భార్య ప్రయత్నిస్తుందని భావించిన అతను మొదటి భార్యకు బెదిరింపు మెయిల్స్ పంపాడు. అంతేకాదు ఓ హోటల్లో ఉండి మరో మోసానికి కూడా పాల్పడాలని భావిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.