హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లాడిన జపాన్ జంట
వరుడు పట్టు దోతి, లాల్చి, బాషింగం కట్టుకోగా వధువు తెల్లటి చీరపై సంప్రదాయ నగలు పెట్టుకొని చేతిలో కొబ్బరి బొండాం పెట్టుకొని అచ్చ తెలుగు సంప్రదాయంలో వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వధూవరులు ఇద్దరు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు. యోషిహికో జపాన్లోని నగోయా కంపెనీలో పనిచేస్తున్నాడు.
వీళ్లిద్దరూ హిందూ వివాహం చేసుకోవాలని ఇక్కడి తెలుగు వారిని సంప్రదించారు. దాంతో అసభాను టెక్నాలజీస్ నిర్వాహకులు వీరికి సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. పెళ్లి కుమార్తెగా ముస్తాబైన నమికోను బుట్టలో ఎత్తుకొని పెళ్లి పీటల వరకు తీసుకువచ్చారు.
అనంతరం వేద పండితులు శ్రీకాంత్ శర్మ, రాయప్రోలు మల్లికార్జున శర్మలు వివాహ తంతును నిర్వహించారు. వధూవరులిద్దరూ పోటీపడి తలంబ్రాలు పోసుకున్నారు. అంతకుముందు వధువుతో పండితులు గౌరీ పూజ, వరుడితో గణపతి పూజ చేయించారు. అనంతరం వరపూజ, కన్యాదానం, మాంగల్యధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలు శాస్త్రోతికంగా జరిగాయి.
ప్రాజెక్టు పని పైన హైదరాబాద్ వచ్చిన వీరు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. మానవీయ సంబంధాలు హిందూమతంతో ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నారు. దీంతో హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని భావించారు.