వినూత్నం: కొవ్వొత్తులతో టిడిపి, టార్చిలైట్లతో జగన్ పార్టీ
హైదరాబాద్: విద్యుత్ సమస్యపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు వినూత్న రీతిలో నిరసన తెలిపాయి. మంగళవారంతో తొలి దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆఖరు రోజైన మంగళవారం టిడిపి గన్ పార్కు వద్ద కొవ్వొత్తులు, ఖాళీ కుండలతో ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొవ్వొత్తులతో అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టార్చిలైట్లతో అసెంబ్లీకి వచ్చింది.
ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ మొదట గంట పాటు పది గంటల వరకు వాయిదా పడింది. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ప్రజలకు టార్చిలైట్లు అన్నా ఇవ్వాలి లేదంటే విద్యుత్ అన్నా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే విద్యుత్ సమస్య అంటున్న తెలుగుదేశం పార్టీని 2009లో ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు.
తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రస్తుత దుస్థితికి కారణం కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే అని మండిపడ్డారు. సమస్యలపై చర్చించకుండానే అధికార పార్టీ సభను వాయిదా వేయించుకొని పారిపోతోందని విమర్శించారు. రెండు పార్టీల పాపం రాష్ట్రాన్ని వెంటాడుతోందన్నారు. కాగా, సభ ప్రారంభంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు.
బడ్జెట్లో లోపాలు: కాగ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శాసనసభకు కాగ్ నివేదికను సమర్పించింది. బడ్జెట్ రూపకల్పనలో లోపాలు ఉన్నట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల మధ్య పొంతన లేదని తెలిపింది. బడ్జెట్లో నిధులు కేటాయించకుండానే ఖర్చు చేయడం ఆర్థిక నియమాల ఉల్లంఘనేనని పేర్కొంది.