తనని కాదంటే: బావ దాడిలో గాయపడ్డ మరదలి మృతి
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె రెండు రోజులుగా హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. నిందితుడు, మృతురాలు ఇద్దరు బావ మరదళ్లు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండల పరిధిలోని మురళీ నగర్ గ్రామానికి చెందిన రాజు, రోజాలు ప్రేమించుకున్నారు. రాజు హైదరాబాదులోని ఓ సాఫ్టువేర్ సంస్థలో క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు.
రోజా ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వారిద్దరి సమ్మతితో కుటుంబ పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 6న నిశ్చితార్థం జరిగింది. ఉగాది తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ మధ్య కాలంలో రోజాన మరో వ్యక్తి ప్రేమించాడు.
ఈ నెల 22న వారు వివాహం చేసుకున్నారు. అదే రోజు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సూచనల మేరకు ఆదివారం పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉదయం భర్తతో పాటు రోజా కందుకూరు మండల చౌరస్తాలో బస్సు దిగి వారి పెద్దల కోసం ఎదురు చూస్తుండగా అటుగా వచ్చిన రాజు ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఈ రోజు ఆమె మృతి చెందింది.