90 మంది గెలిస్తే అంతే: తెరాసపై బైరెడ్డి, ట్రాక్టర్ యాత్ర
హైదరాబాదు అమీర్పేటలోని ఓ హోటల్లో బైరెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ పరిరక్షణ సమితి భేటీ అయింది. ఈ భేటీలో వారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు వంద సీట్లు వస్తాయంటున్నారని, అదే నిజమైతే తమకు వాతలు, కోతలే మిగులుతాయన్నారు. రాయలసీమ హక్కుల కోసం, రాష్ట్రం కోసం ఉద్యమిస్తామన్నారు.
ఇందు కోసం కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తామన్నారు. త్వరలో ఈ కొత్త పార్టీ వస్తుందని ఆయన చెప్పారు. రాయలసీమ హక్కుల కోసం ఏప్రిల్ 13వ తేదిన కర్నూలు నుండి ట్రాక్టర్ యాత్ర ప్రారంభిస్తామన్నారు. సీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని చెప్పారు. సీమ పరిరక్షణ కోసమే తాము ఉద్యమిస్తామన్నారు. ప్రజలను చైతన్యపరుస్తామని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
సీమ ప్రజలు రాజకీయంగా ఎదగాలన్నారు. 2014 ఎన్నికల తర్వాత కాబోయే ముఖ్యమంత్రిని శాసించే స్థితిలో ఉండాలంటే సీమ కోసం ప్రత్యేక పార్టీ కావాల్సిందే అన్నారు. ఇప్పటి వరకు రాయలసీమను ఆదుకున్న నాయకుడే లేకుండా పోయారన్నారు. రాయలసీమ ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందేనని అన్నారు. తాను తొలిసారిగా వినుత్నంగా ట్రాక్టర్ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు.