జగన్పై చంద్రబాబు ఫైర్: కంటతడి పెట్టిన యనమల
సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి దివంగత ఎన్టీ రామారావని, ప్రజల కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, అసమర్ధ ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ను ఎదుర్కొనే శక్తి ఒక్క టిడిపికే ఉందని ఆయన అన్నారు.
వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి. 32 కేజీల కేక్ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు. పెదపూడి గ్రామాన్ని తాను ఎన్నటికీ మరిచిపోలేనని చంద్రబాబు అన్నారు.
తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించి వైయస్ జగన్ పిల్ల కాంగ్రెస్ పార్టీని పెట్టారని, పిల్ల కాంగ్రెసు రాజకీయ విలువలను నాశనం చేసిందని, ఈ పార్టీ అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా దోచుకుంటారని ఆయన అన్నారు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తుదని, తమ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని, వాళ్లు ఇంకా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన అన్నారు.
తమకు అధికార కాంక్ష లేదని, తమ ప్రజలకోసమే పోరాటం చేస్తుందని, స్వార్ధం కోసంకాదని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలపై నాలుగు రోజులుగా టిడిపి ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తున్నది ప్రజలకోసమేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని పాలించే శక్తి ఒక్క టిడిపికి మాత్రమే ఉందని చంద్రబాబు అన్నారు.
ఈ కార్యక్రమలో పాల్గొన్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, పాదాలు నొప్పులు పెడుతున్నా ప్రజల కోసం పాద యాత్ర చేస్తున్నారని ఆయన మీడియా ముందు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయిని యనమల అభిప్రాయపడ్డారు.