పొన్నాల కోడలి వైశాలితో కెసిఆర్ కూతురు కవిత ఢీ!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కన్ను వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గంపై పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యమాల పోరుగడ్డ వరంగల్ జిల్లా. ఈ జిల్లాలో తెలంగాణవాదం నిలువునా గూడుకట్టుకొని ఉంది. ఈ జిల్లాలో జనగామ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేయాలనే ఆలోచనలో కల్వకుంట్ల కవిత ఉన్నారట. ప్రస్తుతం కవిత తెలంగాణ జాగృతిని లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెరాసకు మెజార్టీ సీట్లే వస్తాయని అందరూ భావిస్తున్నారు. దీంతో 2014 ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ ఆరంగేట్రం చేయాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు. అందుకు జనగామ నియోజకవర్గం బాగుంటుందని ఆమె భావిస్తున్నారట.
ప్రస్తుతం జనగామ నియోకవర్గ ఇంఛార్జ్ టిక్కెట్ ఆశిస్తున్నారు. తెరాస అధినేత ఆయనను బుజ్జగించి కూతురుకు ఇస్తారా లేదా అనేది చూడాలి. జనగామ నుండి వీలుకాని పక్షంలో నిజామాబాద్ నుండి పోటీ చేయాలని కవిత భావిస్తున్నారట. అయితే, ఆమె మొదటి ప్రాధాన్యం మాత్రం జనగామకే అంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆమె కెసిఆర్ చెవిలో కూడా వేశారని చెబుతున్నారు.
మరోవైపు మంత్రి పొన్నాల లక్ష్మయ్య వచ్చే ఎన్నికల్లో జనగామ బరిలో దిగిందుకు ఆసక్తి కనబర్చడం లేదట. కిందటిసారి చావుతప్పి కన్నులొట్టబోయి గెలిచిన పొన్నాలకు గెలిచిన సంతోషం కూడా లేదనే చెప్పవచ్చు. ఆయన గెలుపు పైన ప్రత్యర్థి అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. మరోవైపు ఊపందుకున్న తెలంగాణవాదం. ఈ నేపథ్యంలో మరోసారి ఇక్కడి నుండి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఇష్టం చూపడం లేదనేది టాక్.
అయితే, ఆయనకు బదులు ఆయన కోడలు పొన్నాల వైశాలి బరిలోకి దిగవచ్చునని అంటున్నారు. ఆయన తప్పుకుంటే వైశాలికే టిక్కెట్ ఖాయమంటున్నారు. ఇప్పటికే ఆమె తాను లేదా తన మామ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. పొన్నాల ఆసక్తి చూపని నేపథ్యంలో ఆమె పోటీ చేయవచ్చు. దీంతో జనగామ నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో ఆసక్తికరంగా మారనుంది. ఇక్కడ మహిళల మధ్య పోరు జరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
కవిత, వైశాలిలు పోటీకి దిగిన పక్షంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మహిళలను దింపే పరిస్థితి రావొచ్చు. టిడిపి తరఫున మహిళా నేత ఉన్నారు. గాడిపెల్లి ప్రేమలతా రెడ్డి గతంలో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం మహిళా అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే, జనగామ నియోజకవర్గంపై వ్యక్తిగతంగా పట్టు ఉన్న కొమ్మూరి ప్రతాప రెడ్డియే జగన్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మిగిలిన మూడు పార్టీల నుండి మహిళలు బరిలోకి దిగినా జగన్ పార్టీ నుండి ఆయనే నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన, పార్టీ అధిష్టానం కాదనుకుంటేనే మరో మహిళా అభ్యర్థికి సాధ్యమవుతుంది. జనగామ నియోజకవర్గంలో టిడిపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు వ్యక్తిగతంగా పట్టుంది. ఇక తెరాసకు తెలంగాణ సెంటిమెంట్ కలిసి వస్తుంది.