ఎమ్మెల్యేలకు నారా లోకేష్ పరామర్శ: ప్రభుత్వంపై ఫైర్

శాసనసభ్యుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. విద్యుత్ కోత వల్ల మూడు వేల పరిశ్రమలు మూతపడ్డాయని, లక్ష మంది ఉపాధి కోల్పోయారని ఆయన అన్నారు. ప్రజల కోసం శాసనసభ్యులు ఉద్యమిస్తుంటే వ్యతిరేకించే ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నామని ఆయన అన్నారు. తాము స్వార్థం కోసం ఉద్యమించడం లేదని ఆయన అన్నారు.
విద్యుత్ సమస్యలపై హైదరాబాదులోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ శానససభ్యులను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ఆరోగ్యం క్షీణించిన నాయకులను ఒక్కరొక్కరిని ఆయన పరామర్శించారు. పార్టీ శానససభ్యుల దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు.
కాగా, దీక్ష చేస్తున్న తెలుగుదేశం శాసనసభ్యురాలు సత్యవతీ రాథోడ్ ఆరోగ్యం ఎక్కువగా క్షీణించింది. ఆమె షుగర్ లెవెల్స్ విపరీతంగా పడిపోయాయి. దీక్ష చేస్తున్న 27 మందిలో 9 మంది ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. జైపాల్ యాదవ్, దేవినేని ఉమా మహేశ్వర రావు, శ్రీరాంతాతయ్య, సిఎం రమేష్ ఆరోగ్యం దెబ్బ తిన్నదని చెబుతున్నారు.
కాగా, శాసనసభ్యురాలు సీతక్క, పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి ఆరోగ్యం కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు చెబుతున్నారు. మహిళా నేతలను ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీక్షా శిబిరంలో ఉన్న పార్టీ ముఖ్య నేతలు నారా చంద్రబాబు నాయుడితో ఫోన్లో మాట్లాడారు. వైద్యులు చెప్పినట్లు నడుచుకోవాలని ఆయన వారికి సూచించినట్లు తెలుస్తోంది.
గత నాలుగు రోజులుగా తెలుగుదేశం శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు 29 మంది పాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో దీక్ష చేస్తున్నారు. శానససభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత వారు పాదయాత్రగా పాత ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకుని దీక్షను ప్రారంభించారు. తెలుగుదేశం శాసనసభ్యుల దీక్షకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications