మళ్లీ జగన్ ఫ్లెక్సీలో జూనియర్: తీసేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణ, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను అందులో ముద్రించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అక్కడకు వచ్చి బ్యానర్ను తొలగించారు. దీంతో వివాదం సద్దుమణిగిపోయింది. కాగా ఇటీవల విజయవాడలో ఫ్లెక్సీల రగడ రాజుకున్న విషయం తెలిసిందే.
మూడు రోజుల క్రితం మచిలీపట్నంలో వైయస్సార్ కాంగ్రెసు ఫ్లెక్సీలో కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన విషయం చిచ్చు రాజేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా విజయవాడలో కూడా వంగవీటి రాధా, కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూల మధ్య ఫ్లెక్సీల చిచ్చు రాజుకుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాధా-నెహ్రూల మధ్య ఫ్లెక్సీల వార్ సాగింది. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా వెలుస్తున్న వైయస్సార్ కాంగ్రెసు ఫ్లెక్సీలతో ఈ దుమారం చెలరేగింది.
పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వంగవీటి రాధాకృష్ణ యూత్ పేరుతో ఉన్న 'ఇఫ్పుడు ఆట మొదలైంది' (నౌ ది గేమ్ స్టార్ట్స్) అని రాసిన ఫ్లెక్సీని పెట్టారు. దేవినేని నెహ్రూ అనుచరులు 'ఆడటానికి మేం సిద్ధంగా ఉన్నాం'(వి రెడీ టు ప్లే) అని మరో ఫ్లెక్సీని పెట్టారు. దీంతో ప్రతిస్పందించిన వంగవీటి రాధా వర్గం పటమట సెంటర్లోనే మరో ప్లెక్సీని ఏర్పాటు చేశారు. దానిపై 'పిల్లలతో మేం ఆడం'(వి డోంట్ ప్లే విత్ కిడ్స్) అని కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఫ్లెక్సీ వార్ ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఆందోళన ప్రారంభమైంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని దేవినేని నెహ్రూ పలుమార్లు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన వంగవీటి రాధాను ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఆయనే ఇక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ట్రాఫిక్ అభ్యంతరాల పేరుతో వర్గ ఫ్లెక్సీని కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు.