మంత్రి పార్థసారథికి తండ్రి షాక్: షర్మిలతో భేటీ
షర్మిలను కలిసి ఆమెకు రెడ్డయ్య సంఘీభావం ప్రకటించారు. త్వరలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. షర్మిలతో ఆయన పది నిమిషాల పాటు మాట్లాడారు. ట్రాఫిక్ జామ్ వల్ల ఆగానని, షర్మిలను కలవలేదని తొలుత చెప్పిన రెడ్డయ్య ఆ తర్వాత భేటీని ధ్రువీకరించారు. షర్మిలతో భేటీ తర్వాత ఆయన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్యను ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి, ఇతర ఇబ్బందులకు వారు ముగ్గురే కారణమని రెడ్డయ్య ధ్వజమెత్తారు.
కెపి రెడ్డయ్య గతంలో కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి ఆ తర్వాత చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో కుమారుడు, మంత్రి పార్థసారథితో కలిసి ఆయన కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటూ వస్తున్నారు. అకస్మాత్తుగా ఆయన శనివారం షర్మిలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ఆయన మచిలీపట్నం పార్లమెంటు సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.