గుజరాత్లో చూసి రండి: కిరణ్కి నాగం, బిజెపికి మద్దతు
రాష్ట్రంలో కరెంటు కోతలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోదన్నారు. గుజరాత్ వెళ్లి సిఎం స్వయంగా చూడాలని సూచించారు. అన్ని పార్టీలు సమైక్యంగా పోరాడితేనే ఈ సంక్షోభం నుండి గట్టెక్కగలమని ఆయన అన్నారు.
కాగా, విద్యుత్ అంశంపై బిజెపి నేతల నిరవధిక నిరాహార దీక్ష శనివారం ప్రారంభమైంది. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం సాయంత్రం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో దీక్ష చేపట్టారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీలను ఉపసంహరించుకునేవరకు ఈ పోరు దీక్షను కొనసాగిస్తామని పార్టీ ప్రకటించింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సాయంత్రం ముగ్గురు ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షలను పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రారంభించారు.
విద్యుత్తు విధానం విషయంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈఆర్సీ ప్రభుత్వం చేతిలో ఆటబొమ్మగా మారిందని ఆయన విమర్శించారు. ఈ చార్జీల పెంపు సీఎం కిరణ్ పతనానికి దారితీస్తుందని ఆగ్రహించారు. చార్జీల విషయంలో ప్రజలపక్షాన నిలవాల్సిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు విడిపోయాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని, సిద్ధాంతాలు వేరైనా... ప్రజా సమస్యలపై కలిసి కట్టుగా పోరాడుతామని హెచ్చరించారు.