కెసిఆర్ ఫస్ట్ లిస్ట్లో కవితకు నో: రాములమ్మ సస్పెన్స్
దీంతో అందులో ఎవరి పేర్లు ఉన్నాయో తెలుసుకోవటానికి చాలా మంది నేతలు ఆసక్తి చూపుతున్నారు. కెసిఆర్ సన్నిహిత వర్గాల నుండి పలువురు ఆశావహులు ఆరా తీస్తున్నారట. తొలి దఫా జాబితాలో 60 వరకు అసెంబ్లీ, ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతమందిని కూడా ప్రకటించక పోవచ్చుననే మరో వాదన కూడా వినిపిస్తోంది. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేయటం దాదాపు ఖాయమైందంటున్నారు.
ఆమె వరంగల్ జిల్లా జనగామ నుండి పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అంతిమంగా నిజామాబాద్ నుండి బరిలోకి దింపాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అదే సమయంలో తొలి జాబితాలోనే ఆమె పేరును ప్రకటిస్తే కుటుంబానికి పెద్దపీట వేస్తున్నారని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందట. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో కవిత పేరు ప్రకటించాలని భావించినప్పటికీ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
తెరాస అధినాయకత్వానికి మెదక్ లోక్సభ స్థానం ప్రధాన సమస్యగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి ప్రస్తుతం ఎంపివిజయశాంతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి కెసిఆర్ పోటీ చేస్తారనే ప్రచారం తెరాస వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సాగించాల్సిన ఉన్నందున సురక్షితంగా భావిస్తున్న సొంత జిల్లా మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
విజయశాంతి కూడా సిట్టింగ్ స్థానం తప్ప మరో స్థానంలో పోటీ చేయటానికి ఇష్టంగా లేరట. నల్గొండ జిల్లా భువనగిరి నుండి పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మెదక్కే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారట. మెదక్ టిక్కెట్ కాకుండా మరో నియోజకవర్గం టిక్కెట్ ఇస్తే ఆమె ఏం చేస్తారనే అంశం సస్పెన్స్గా మారింది. ఉద్యమంలో బిజెపి కూడా కీలకంగా మారడంతో అటువైపు చూసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. మెదక్ నుండి పోటీకి మరికొందరు కూడా ఆసక్తి కనబరుస్తున్నారట.