జగన్ పార్టీలో లుకలుకలు: నన్నపనేని కూతురుకు సెగ
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజక వర్గ ఇంఛార్జిగా వేణును నియమించారు. వేణును నియమించడంతో అసంతృప్త నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేణు స్థానిక నేత కాదని, స్థానికులైన తమకు కాకుండా స్థానికేతరుడన వేణును ఎలా ఇంఛార్జీగా నియమిస్తారని, తాము పార్టీని నియోజకవర్గంలో మొదటి నుండి అభివృద్ధి చేస్తున్నామని అసంతృప్త నేతలు మండిపడుతున్నారు. వేణునే కొనసాగించిన పక్షంలో తాము రాజీనామాకు కూడా సిద్ధమని చెప్పేందుకు, అవసరమైతే రాజీనామా చేసేందుకు పలువురు నియోజకవర్గ ముఖ్యనేతలు హైదరాబాద్ బయలుదేరారట.
నన్నపనేని కూతురుకు సెగ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి కూతురు నన్నపనేని సుధకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఇబ్బందులు తప్పడం లేదు. నన్నపనేని టిడిపిలో ఉన్నప్పటికీ సుధ కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. తాను వద్దని అప్పుడే చెప్పానని, పిల్లలు చెబితే వినడం లేదని నన్నపనేని తన కూతురు జగన్ పార్టీలోకి వెళ్లిన సమయంలో చెప్పారు.
గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సుధ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వినుకొండ సమన్వయకర్తగా నన్నపనేని సుధను జగన్ పార్టీ నియమించింది. సుధ నియామకంపై అదే నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న బొల్లా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధను ఇంఛార్జిగా తొలగించాలని వారు అల్టిమేటం కూడా జారీ చేశారట.