లంకలో తమిళుల ఊచకోత దృశ్యాలు చూపిన ఛానల్ 4
యుద్ధానంతరం శ్రీలంకలో శాంతి కుసుమాలు వికసించాయి! కానీ ఆ పూల మొక్కలకు తమిళ జాతీయుల దేహాలే ఎరువులుగా మారాయని, రక్తాన్నే నీళ్లుగా పోశారని ససాక్ష్యంగా రుజువు చేసింది బ్రిటన్కు చెందిన చానల్ 4. జాఫ్నా, కిలినోచ్చి ప్రాంతాల్లో లంక సైన్యం సృష్టించిన మారణ హోమం తాలూకు చిత్రాలను ఇప్పుడు ఈ ప్రపంచానికి చూపింది.
ఎల్టీటీఈపై యుద్ధంలో శ్రీలంక సైన్యం మానవ హక్కులను మంటగలిపిందని... తమిళుల ప్రాణాలను తూటాలకు బలి చేసిందనే ఆరోపణలకు బలం చేకూర్చింది. యుద్ధం పేరుతో అక్కడ తమిళుల ఊచకోత జరుగుతోందని, తమిళుల శవాలతో శ్రీలంక సైన్యం ఆడుకుంటోందని ఎల్టీటీఈ సానుభూతిపరుడైన వైగో నెత్తీ నోరూ మొత్తుకున్నా.. అప్పట్లో తమిళనాడులో చలనం లేకపోయింది.
అయితే ఫిబ్రవరి 18వ తేదీన బ్రిటన్కు చెందిన ఛానల్-4 కథనం ప్రసారమైన తర్వాతే తమిళనాడులో కదలిక మొదలైంది. ఆ కదలిక ఇప్పుడు ఉద్యమంగా, మహోద్యమంగా మారుతోంది. ఒకప్పుడు తమిళనాడు మొత్తాన్ని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని మించి, తమిళుల స్వాభిమానం పేరుతో నడచిన ఆందోళనలకంటే తీవ్రంగా... ఇప్పుడు తమిళ యువత ఉద్యమిస్తోంది.