చిరు మరో కొలికి: ఆయన వర్గం మంత్రి అసంతృప్తి

ప్రభుత్వం తగ్గించిన విద్యుత్ చార్జీల విషయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల తగ్గుదల విషయంలో మధ్య తరగతి, పరిశ్రమలను పరిగణలోకి తీసుకుంటే బాగుండేదని మంత్రి అన్నారు. విద్యుత్ కోతలు, ఛార్జీల పెంపు వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
కోతలు, ఛార్జీల పెంపు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే అవకాశముందని రామచంద్రయ్య అన్నారు. విద్యుత్ కోతలను తగ్గించే అంశం పైన ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. అధికారులు చెబుతున్నట్లుగా విద్యుత్ సరఫరా కావడం లేదని అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గినా మధ్య తరగతితో పాటు పరిశ్రమలను పరిగణలోకి తీసుకుంటే బాగుండేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు వందల యూనిట్ల లోపు కాల్చిన వారికి పాత విద్యుత్ ఛార్జీలే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే.
గందరగోళంగా సిఎం: రేవంత్ రెడ్డి
విద్యుత్తు చార్జీలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గందరగోళంగా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్తు చార్జీల భారం ప్రజలపై మోపేందుకు ముఖ్యమంత్రి రంగం సిద్ధం చేస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. చాకిరేవులో పనిచేసేవారు కూడా ముఖ్యమంత్రికి పెట్టుబడిదారులుగా కనిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఈఆర్సీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి చార్జీలు పెంచేలా చూసింది ముఖ్యమంత్రి కాదా అని ఆయన అడిగారు. విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతిని నిర్మూలించకుండా కథలు ఎన్ని చెప్పి ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. విద్యుత్తు సర్చార్జీలు వసూలు చేసుకోవచ్చునని ఆనాడు చెప్పింది వైయస్ రాజశేఖర రెడ్డి కాదా అని ఆయన అడిగారు.
చిత్తుశుద్ధి ఉంటే విద్యుత్తు కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. కొనుగోళ్లలో అవినీతికి పాల్పడకపోతే కాగ్తో విచారణ జరిపించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications