జగన్ కేసులో సాక్షిగా సూరీడు?: రేపు మరో ఛార్జీషీటు!
తాజాగా ఈ నెల 2వ తేదిన దాఖలు చేసిన అనుబంధ ఛార్జీషీటులో కూడా ఆయన పేరును చేర్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన వద్దకు ఎవరెవరు వచ్చేవారు? జగతిలో రూ.36.5 కోట్ల పెట్టుబడులు పెట్టిన అరబిందో, హెటిరో, ట్రైడెంట్ ఫార్మా కంపెనీల ప్రతినిధులలో ఎవరినైనా చూశారా? తదితర వివరాలు తెలుసుకునేందుకు సిబిఐ ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది.
ఈ మేరకు ఆయన వాంగ్మూలాన్ని 161 సిఆర్పిసి కింద రికార్డు చేసినట్లు చెబుతున్నారు. పలు ఫార్మా కంపెనీల పేరుతో జగతిలోకి పెట్టుబడులు వచ్చినట్లుగా సిబిఐ గుర్తించింది. పలు కంపెనీలకు అదే పేరుతో కొన్ని అనుబంధ కంపెనీలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇలా ఏర్పడిన సంస్థలు 'కంపెనీల చట్టం నియమ నిబంధనలను పాటించాయా... లేదా? అనే అంశంపై సిబిఐ అనుబంధ చార్జ్షీట్ వేసింది.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసి) నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అతిక్రమణలున్నాయని తేలింది. దీంతో ఆర్వోసి అధికారులను, వారితో పాటు సూరీడును కూడా సాక్షులుగా చేర్చినట్లుగా వార్తలొస్తున్నాయి. మరోవైపు ఇండియా, దాల్మియా, పెన్నా సిమెంటు కంపెనీలకు అప్పటి వైయస్ సర్కారు ఇచ్చిన రాయితీలు, భూములు, పన్ను మినహాయింపులపై చార్జిషీటును సిబిఐ శనివారం కోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కొన్ని రోజుల వ్యవధిలో మిగిలిన అంశాలపై చార్జ్షీట్ వేసే అవకాశం ఉంది.