చంద్రబాబు యాత్ర: టిడిపిలో టిక్కెట్ల కోసం హోరాహోరీ
కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంటు స్థానంతో పాటు గన్నవరం నియోజకవర్గం అధినేతకు క్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. 1994 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి టిడిపి అధినాయకత్వానికి సమస్యగా పరిణమించిన. గన్నవరం టికెట్టు వ్యవహారం ఈసారీ ఆసక్తి రేకిస్తోంది. అక్కడ టికెట్ కోసం పోటీపడిన నేతల్లో ఒకరికి ఎంపీగా, మరొకరికి అసెంబ్లీ స్థానం ఇచ్చి సర్దుబాటు చేసుకొంటూ వస్తున్నారు.
కానీ, ఈసారి ఆ వెసులుబాటు దొరకడం లేదు. గతంలో అక్కడ వల్లభనేని వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ సారి విజయవాడ ఎంపీ టికెట్ను కేశినేని నానికి ఖరారు చేశారు. దాంతో వంశీ మళ్లీ గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాలవర్ధన రావు కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరు. మరోవైపు విజయవాడ పార్లమెంటు స్థానాన్ని గద్దె రామ్మోహన రావు కూడా ఆశిస్తున్నారు. ఎవరికి వారు బాబును కలిసి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక తనకు గన్నవరం టికెట్ ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకొంటానని వంశీ చెబుతున్నారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మల్కాజిగిరి సీటు వ్యవహారం కూడా టిడిపిని రచ్చకీడుస్తోంది. ప్రస్తుత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈసారి మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన స్వస్థలం అదే నియోజకవర్గంలో ఉంది. గతంలో మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన మహేష్ గౌడ్ దీనిపై జిల్లా నేతలకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం మైనంపల్లి వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఇతర జిల్లాల వారు రంగారెడ్డికి రావద్దని హుకూం జారీ చేశారు. మైనంపల్లి కూడా ధీటుగానే స్పందించారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస సీటు వ్యవహారం చిక్కుముడిగా మారింది. అక్కడ తమ్మినేని సీతారాం చాలాసార్లు టిడిపితరపున పోటీ చేశారు. గత ఎన్నికల్లో అతను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. అప్పుడు సీతారాం బావమరిది రవి కుమార్ అక్కడ టిడిపి తరపున పోటీ చేశారు. తర్వాత మళ్లీ టిడిపిలోకి వచ్చిన తమ్మినేని ఆముదాలవలస సీటు కోరుతున్నారు. రవి కుమార్ కూడా అదే నియోజకవర్గం నుండి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కానీ, అసంతృప్తితో ఉన్న సీతారాం తన సీటు విషయం తేల్చకపోతే బయటకు వెళ్ళిపోతానన్న సంకేతాలు పార్టీ వర్గాలకు పంపుతున్నారు. ఇక, హైదరాబాద్లో సనత్నగర్ స్థానం వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అక్కడ ప్రస్తుతం ఇన్చార్జిగా కూన వెంకటేశ్ గౌడ్ ఉన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈసారి తన సొంత సీటు సికింద్రాబాద్ను వదిలి సనత్నగర్ రావాలన్న ప్రయత్నంలో ఉన్నారు.