ఇదీ జగన్ కేసు దర్యాఫ్తు!: కోర్టుకు సిబిఐ స్టేటస్ రిపోర్ట్
పెన్నా, దాల్మియా, ఇండియా సిమెంట్స్ పైన విచారణ పూర్తయిందని, వీటిపై త్వరలో ఛార్జీషీటును దాఖలు చేస్తామని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. సండూరు పవర్ ప్రాజెక్టు, భారతి సిమెంట్స్, ఇందూ, లేపాక్షి కంపెనీలతో పాటు పలు కంపెనీలపై కేసు దర్యాఫ్తు కీలక దశలో ఉందని, ఈ అంశాలకు సంబంధించి పలువురు సాక్ష్యులను విచారించవలసి ఉందని కోర్టుకు సిబిఐ తెలిపింది.
జగన్ కేసులో సిబిఐ మరో ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తోంది. సిమెంట్స్ కంపెనీపై ఛార్జీషీట్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. జగతి పబ్లికేషన్స్లోకి దాల్మియా కంపెనీ పెట్టుబడుల వివరాలు అందులో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మంత్రులను సిబిఐ ప్రశ్నించింది. దిల్ కుషా నుండి రెండు బాక్సుల్లో సిబిఐ పత్రాలను తరలించింది. ఇందులో శ్రీలక్ష్మి, బిపి ఆచార్యలపై అభియోగాలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
15 వరకు రిమాండు
జగన్ ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసుల నిందితులకు కోర్టు ఈ నెల 15వ తేది వరకు రిమాండును విధించింది. జగన్ కేసులో అభియోగాల నమోదుపై విచారణను కూడా ఈ నెల 15కు వాయిదా వేసింది. కాగా ఈ మూడు కేసులకు సంబంధించి మంత్రి ధర్మాన ప్రసాద రావు, విజయ సాయి రెడ్డి, బిపి ఆచార్య, శామ్యూల్, మన్మోహన్ సింగ్, అయోధ్య రామిరెడ్డి, ప్రకాశ్, శరత్ చంద్ర తదితరులు కోర్టుకు హాజరయ్యారు.