సబితపై పెరుగుతున్న ఒత్తిడి: మంత్రులతో మంతనాలు
నైతిక బాధ్యత వహించి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. మంత్రులంతా జైల్లో ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులను సిబిఐ జగన్ కేసులో నిందితులుగా చేర్చిందని, తాజాగా, సబితా ఇంద్రారెడ్డి పేరును చేర్చిందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను అన్యాక్రాంతం చేశారని ఆయన ఆరోపించారు.
సబితా ఇంద్రారెడ్డి కాసేపట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవనున్నారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాదు బయలుదేరి వచ్చారు. ఆయన సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే సబితా ఇంద్రారెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇదివరకు సిబిఐ అధికారులు సబితా ఇంద్రారెడ్డిని ప్రశ్నించారు. సిమెంట్స్ కంపెనీలకు జలాలను కేటాయించిన వ్యవహారంలో మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. తాజా పరిణామంతో మిగతా మంత్రుల్లో కూడా గుబులు రేగుతోంది.