జగన్ కేసు: సబితకు షాక్, నాల్గో నిందితురాలిగా పేరు
ఇప్పటికే జగన్ కేసుల్లో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను, మంత్రి ధర్మాన ప్రసాదరావును సిబిఐ నిందితులుగా చేర్చింది. తన పేరును నిందితుడిగా చేర్చిన తర్వాత మోహిదేవి వెంకరమణ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ధర్మాన ప్రసాదరావు చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
దాల్మియా సిమెంట్స్పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ఎ1గా వైయస్ జగన్, ఎ2గా విజయసాయిరెడ్డి, ఎ3గా దాల్మియా సిమెంట్స్ ఎండి పుణీత్ దాల్మియా, ఎ4గా సబితా ఇంద్రారెడ్డి, ఎ5గా ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఎ6గా గనుల మాజీ ఎండి రాజగోపాల్, ఎ7గా ఈశ్వర్ సిమెంట్స్ ఎండి సజ్జల దివాకర్, ఎ8గా దాల్మియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ ఎస్ మిత్ర, ఎ9గా దాల్మియా సీనియర్ మేనేజర్ నిల్ ధమల్ భేరీ, ఎ10గా దాల్మియా మేనేజర్ జయదీప్ బసు, ఎ11గా రఘురామ్ సిమెంట్, ఎ12గా దాల్మియా సిమెంట్స్, ఎ13గా ఈశ్వర్ సిమెంట్స్ పేర్లు ఉన్నాయి.
హైదరాబాద్లోని దిల్కుషా అతిథి గృహం నుంచి చార్జిషీట్ను సిబిఐ అధికారులు రెండు బాక్సుల్లో సిబిఐ కోర్టుకు తెచ్చారు. సిబిఐ దాల్మియా సిమెంట్స్పై 67 పేజీల చార్జిషీట్ను రూపొందించారు. మొత్తం 47 మందిని సాక్షులుగా చేర్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిందని, ఫలితంగా జగన్ కంపెనీల్లో 95 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిందని సిబిఐ ఆరోపిస్తోంది. కడప జిల్లా మైలవరం వద్ద దాల్మియా సిమెంట్స్కు 407 హెక్టార్ల సున్నంరాయి గనులను 30 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టారు.
దాల్మియా సిమెంట్స్ జగన్కు భారతి సిమెంట్స్లో 50 కోట్ల రూపాయలు, జగతి పబ్లికేషన్స్లో 45 కోట్లు రూపాయలు పెట్టుబడులుగా పెట్టిందని ఆరోపణ. వైయస్ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినందుకు ప్రతిఫలంగానే జగన్ కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టిందని సిబిఐ అభియోగం మోపింది.
సబితా ఇంద్రారెడ్డిపై 120బి, 409, 420 ఐపిసి సెక్షన్ల కింద సిబిఐ అభియోగాలు మోపింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9, 12, 13, 13(1) కింద అభియోగాలు నమోదు చేసింది.