నాలుగు నెలలుగా ఇంట్లోనే తల్లీకూతుళ్ల శవాలు
విమలమ్మ వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసి రిటైర్ కావడంతో పెళ్లికాని తన కూతురుతో కలసి అద్దె ఇంటిలో నివసిస్తుండేది. నిరుడు అక్టోబర్ నెల నుండి వారు అద్దె సక్రమంగా చెల్లించడం లేదు, ఇంట్లో కూడా సక్రమంగా ఉండడం లేదు. దీంతో విమలమ్మ కుమారుడు కమలాకర్ తల్లి, సోదరి అదృశ్యంపై ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో ఇంటి యజమాని కూతురు రెండు నెలల క్రితం మృతి చెందడం, యజమాని పదిహేను రోజుల కిందట ఆనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందడంతో రెండో అంతస్థులో ఉన్న వారి ఇంటి అద్దె గురించి పట్టించుకోలేదు. దీంతో అద్దె అడగడానికి కూడా ఎవరూ ఆ ఇంటికి రాలేదు. దాంతో విషయం ఇంత కాలం ఎవరి దృష్టికి కూడా రాలేదు.
కాగా విమలమ్మ, ఆమె కుమార్తెలు గత నాలుగు నెలల క్రితం ఇంట్లోనే విష పదార్థం తీసుకొని మృతి చెందారా, లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కవారితో కూడా సంబంధాలు లేకుండా ఎక్కడకు వెళ్లాలన్నా తల్లికూతుర్లు ఇద్దరే వెళ్లి తిరిగి వచ్చే వారని, వారు ఎవరితో ఎటువంటి సంబంధాలు కలిగిలేరని చుట్టు పక్కలవారు చెబుతున్నారు.
మృతురాలి కుమారుడు కమలాకర్ టిటిడికి చెందిన భక్తి ఛానల్లో పనిచేస్తూ తిరుపతిలో ఉంటున్నాడు. విషయం తెలుసుకొన్న కమలాకర్ తిరుపతి నుండి గూడూరుకు వచ్చి తల్లి, సోదరి మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న టౌన్ సిఐ ఉప్పాల సత్యనారాయణ, టౌన్ ఎస్సై షరీఫ్లు సంఘటన స్థలానికి చేరుకొని పై అంతస్తులోని తలుపులు తెరిపించి అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.
తల్లీకూతుళ్లు వాడిన సెల్ఫోన్ నంబరు, చివరి సారిగా ఎవరి వద్ద నుండి వారు ఫోన్ మాట్లాడింది, వారు ఎవరికి ఫోన్ చేసి మట్లాడారు అనే కోణంపై దర్యాపు చేస్తున్నారు. పై అంతస్తులోని పడక గదిలో ఇద్దరు విగత జీవులై గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు చివికిపోయాయి.