నీళ్లు లేకుంటే డ్యామ్లో మూత్రం పోయాలా: పవార్
ఈ సందర్ఫంగా దేశ్ముఖ్ దీక్ష విషయం మీడియా ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. "ఎవరో దేశ్ముఖ్ అట. ఇప్పటికి 55 రోజులుగా దీక్ష పట్టారు. డ్యామ్ల నుంచి నీళ్లు వదలాలని ఆయన అడుగుతున్నారు. నీళ్లు ఉంటే కదా..వదలడానికి? మరి ఏం చేయాలి? అందరం కలిసి డ్యామ్ల్లో మూత్రం పోయాలా? అదీ సమస్యే. ఎందుకంటే మూత్రం పోసేందుకు కూడా నీళ్లు దొరకడం లేదు'' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అజిత్ వ్యాఖ్యలపై బిజెపి తీవ్ర అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ప్రజలను ఘోరంగా అవమానించారని మండిపడింది. నీళ్లు, కరెంటు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయకుండా బాధ్యతారహితంగా మాట్లాడటం దారుణమని ఆ పార్టీ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ గర్హించారు. రైతు సంఘాలు కూడా అజిత్ పవార్ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. కొల్హాపూర్లో ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టాయి. అటు రాజకీయ పార్టీలనుంచి, ఇటు పౌర సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో అజిత్ పవార్ ఎట్టకేలకు దిగివచ్చారు.
"నా వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలకు మనస్తాపం కలిగితే క్షమించాలని కోరుతున్నాను. కరువు పీడిత ప్రాంతాల ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది'' అని ఆయన అన్నారు.
జనాభా పెరుగుదల వల్లే కరెంట్ కష్టాలు
అజిత్ పవార్ మరో వివాదాస్పదమైన వ్యాఖ్య కూడా చేశారు. మహారాష్ట్రలో కరెంట్ కోత ఉందని అంటున్నారని, జనాభా పెరుగుదల వల్లనే ఆ సమస్య వచ్చి పడిందని ఆయన అన్నారు. దాంతో ఆ మాటలు విన్నవారు గట్టిగా నవ్వేశారు. పగలే నేను తాగానని మీరు అనుకుంటున్నట్లు ఉన్నారని ఆయన అన్నారు. అదివారం అజిత్ పవార్ ర్యాలీ నిర్వహించాల్సి ఉండింది. అయితే, అది రద్దయింది. దానిపై ఎన్సీపి నేతలు పెదవి విప్పడం లేదు. పవార్ వ్యాఖ్యల పట్ల ఎన్సీపి నేతలు కూడా కంగు తిన్నట్లు కనిపించారు. హాస్యానికి కూడా అటువంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని వారు అభిప్రాయపడుతున్నారు.