హైదరాబాద్ యువతిపై గోవాలో స్నేహితుడి దారుణం
హైదరాబాద్లో ఓ కళాశాలలో చదువుతున్న ముగ్గురు యువకులు, బాధితురాలితో కలిసి గోవా టూర్కు ఈ నెల 5వ తారీఖున వెళ్లారు. రెండు రోజులు గోవాలోని ఓ హోటల్లో ఉన్న అనంతరం తర్వాత కూల్ డ్రింకులో తనకు మద్యం కలిపి ఇచ్చి తాగించారని, ఆ తర్వాత నజీర్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నజీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం జిల్లాలో అగ్ని ప్రమాదం
ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలం రేపాక గొమ్ములో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఒకరి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి.
ఇవి చుట్టు పక్కల ఉన్న ఇళ్లకు కూడా అంటుకున్నాయి. ప్రమాదంలో పన్నెండు ఇళ్లు అగ్నికి ఆహూతి అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ సిబ్బందికి ఒక్కో కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.5000, నిత్యావసర సరుకులను అందజేశారు.
బెజవాడలో దొంగతనం
విజయవాడలోని బందరు రోడ్డు అశోక్ నగర్లోని ధనేకుల వారి వీధిలో దొంగలు పడి ఒక ఇంట్లో 35 కాసుల బంగారం, మూడున్నర కేజీల వెండిని దొంగిలించారు. తుమ్మల హరిబాబు అనే టెలికాం మాజీ ఉద్యోగి తన భార్యను ఆసుపత్రికి తీసుకు వెళ్లి, రాత్రి అక్కడే ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగలు ఇనుప చువ్వలతో తాళం పగులగొట్టి బీరువాలోని బంగారం, వెండితో పాటు ఆరువందల అమెరికన్ డాలర్లను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పదేళ్ల బాలికపై అత్యాచారం అరెస్ట్
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్లో పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతనికి ముగ్గురు సంతానం ఉంది.