ఓదార్పు టు ఓట్: మొదట్నుంచి జగన్ అంతే!(పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ నిన్న అధికార కాంగ్రెసు పార్టీని, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. జగన్ పార్టీ పెట్టక ముందు నుండే ఆయా పార్టీలను తన వ్యూహాలతో ఇబ్బందుల్లోకి నెట్టారని చెప్పవచ్చు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత కాంగ్రెసు అతనికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు ఆసక్తి చూపించక పోవడం వల్లనే జగన్ పార్టీ పెట్టారనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే.
పార్టీ తనను సిఎంగా చేయక పోవడంతో జగన్ వ్యూహాత్మకంగా పార్టీలో, ప్రజల్లో పట్టు కోసం ఓదార్పు యాత్ర చేపట్టారని, పార్టీ తనకు 'ముఖ్య'మైన బాధ్యతలు అప్పగించదని తేలడం వల్లనే జగన్ ఏకంగా అధిష్టానానికే సవాల్ విసిరారని, ఆ తర్వాత పార్టీ తమను వేధిస్తోందని చెప్పి బయటకు రావడం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించడం ప్రణాళిక ప్రకారం జగన్ చేశారంటున్నారు. ఓదార్పు యాత్ర కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఓ విధమైన మైండ్ గేమే అంటున్నారు.
ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించడం ప్రారంభించారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్లోను జగన్ మైండ్ గేమ్ ఉపయోగించారని చెబుతారు. తన వైపుకు వచ్చే ఎమ్మెల్యేలను జగన్ సమయం, సందర్భం వచ్చినప్పుడు బయటకు తీసుకు వచ్చేవారని, తీసుకు వస్తున్నారని అంటున్నారు. జగన్ కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చాక అతని ఆస్తులపై సిబిఐ విచారణ ప్రారంభమై జైలుకు వెళ్లారు.
పార్టీకి, తనకు పొలిటికల్ మైలేజ్ వస్తుందునుకునే సమయంలోనే జగన్ తన వర్గం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన వైపుకు రప్పించుకుంటారని అంటున్నారు. ఎంత మంది వస్తారు? ఎవరు వస్తారు? అనే విషయం ముందుగానే తెలిసినప్పటికీ టార్గెట్ పార్టీని ఒత్తిడిలోకి నెట్టే వ్యూహంలో భాగంగా మొదటి నుండి మైండ్ గేమ్ ఆడుతూ వస్తున్నారంటున్నారు. కాంగ్రెసు పార్టీ పైన ఆడిన మైండ్ గేమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన ఆడుతున్నారంటున్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు, బాబాయ్, మావయ్యలపై అసంతృప్తితో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను జగన్ పార్టీ ఉపయోగించుకోవడం ద్వారా టిడిపిని ఒత్తిడిలోకి నెడుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి.. జగన్ తండ్రి అయినప్పటికీ కాంగ్రెసు నేత. కాంగ్రెసు నేతగా ఉన్న తన తండ్రి ఇమేజ్ను జగన్ క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోను వినియోగించుకొని ఆ పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తోందంటున్నారు. అలాగే జూనియర్ అసంతృప్తిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే ఆయన ఫోటోను ఉపయోగించుకుంటుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్ను టిడిపికి కాకుండా చేయడం వైయస్ హయాంలోనే ప్రారంభమైందంటున్నారు.
సోనియా గాంధీ వద్దని చెప్పినప్పటికీ జగన్ ఓదార్పు యాత్రపై వెనక్కి తగ్గలేదు. జగన్ యాత్ర ఓదార్పులా లేదని రాజకీయ యాత్రలా ఉందనే విమర్శలు వచ్చాయి. వద్దని చెప్పినా ఓదార్పు కొనసాగించడం జగన్ వ్యూహాత్మకంగానే దానిని కొనసాగించారంటారు.
జగన్ ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో కాంగ్రెసుతో మైండ్ గేమ్ ఆడారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల విషయంలోను అదే తరహా వ్యూహంతో ముందుకెళ్లారు.
వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు నేత అయినప్పటికీ అతనిని ఇప్పుడు జగన్ సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు నందమూరి తారక రామారావు ఇమేజ్ను సొంతం చేసుకొని టిడిపిని దెబ్బతీసే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారంటున్నారు.
కాంగ్రెసుకు వ్యతిరేకంగా టిడిపిని ఎన్టీఆర్ స్థాపించారు. ఆయన ఇమేజ్ను ఇప్పుడు జగన్ పార్టీ సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్టీఆర్ ఫోటో ద్వారా ఓ సామాజిక వర్గాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్ను కాంగ్రెసు సొమ్ము చేసుకోవాలని వైయస్ నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు.