మమతా బెనర్జీపై ఢిల్లీలో దాడి!: మంత్రిపై పిడిగుద్దులు

మధ్యాహ్నం 3.45 సమయంలో యోజన భవన్కు వచ్చిన మమత, అమిత్ మిత్రాలను దాదాపు 150 మంది చుట్టుముట్టారు. మమతా బెనర్జీ డౌన్ డౌన్, టిఎంసి డౌన్ డౌన్, హంతకురాలు మమతా.. సిగ్గుపడు అంటూ నినాదాలు చేశారు. కారులోంచి దిగొద్దని మమతకు పోలీసులు చెప్పినా, ఆమె నడుచుకుంటూనే వెళ్లారు. పోలీసులు వెంటనే ఆమెకు రక్షణ వలయం కల్పించగా, మిత్రా ఆందోళనకారుల చేతికి చిక్కారు. వారు ఆయనను తోసేసి పిడిగుద్దులు కురిపించారు.
ఆయన కుర్తా చిరిగిపోయింది. అనంతరం ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్సింగ్ ఆహ్లూవాలియా, కేంద్ర ప్రణాళికా శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లాలపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. మీరు ఇక్కడో కొత్త సంప్రదాయం సృష్టించారని, తమ మంత్రిపై దాడి జరిగిందని, అక్కడ 20 మంది గూండాలున్నారని, ఢిల్లీలో ఏమాత్రం భద్రత లేదని, ఇలాగైతే ప్రణాళికా సంఘం సమావేశం ఎందుకని ప్రశ్నించారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో మమతా బెనర్జీకి ప్రధానమంత్రితో జరగాల్సిన కీలక సమావేశం రద్దయింది. ఈ సంఘటనను తృణమూల్ కాంగ్రెసు పార్టీ ఖండించింది. సిపిఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్ల ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ ఆరోపించింది. దీనికి నిరసనగా ఈనెల 22న రెండోవిడత పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
మమతకు అనారోగ్యం.. ఎయిమ్స్లో మిత్రా
ఢిల్లీ సంఘటన అనంతరం మమతా బెనర్జీ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆమె బిపి పడిపోయింది. ఢిల్లీలోని ఆమె నివాసంలోనే వైద్యులు ఆమెకు ఆక్సిజన్ అందించారు. దాడిలో గాయపడిన పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిత్రాను ఎయిమ్స్కు తరలించారు. అక్కడ ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు చేశారు. ఆయనను ఆస్పత్రిలో చేర్చుకున్నారు. బుధవారం ఉదయం డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
మమతపైగానీ, మిత్రాపై గానీ తాము దాడి చేయలేదని ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి రితంభర బెనర్జీ తెలిపారు. అది శాంతియుత నిరసనేనని, గుప్తా హత్యపై జ్యుడీషియల్ విచారణ కోరుతున్నామని, మమత ఎక్కడికెళ్లినా నిరసన వ్యక్తం చేసి తీరుతామని చెప్పారు. సుదీప్తో మృతి చిన్న విషయమేనని మమత వ్యాఖ్యానించడం వల్లే తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తోందని, ప్రణాళికా సంఘం దీనిపై ఢిల్లీ పోలీసులను ప్రశ్నించిందని మంత్రి శుక్లా ఆ తర్వాత చెప్పారు. అమిత్ మిత్రాపై దాడి చేయడం, మమతా బెనర్జీని చుట్టుముట్టడాన్ని సిపిఎం ఖండించింది.
చంపాలని చూశారు: మమత
ప్రణాళిక సంఘం కార్యాలయంలో భేటీ తర్వాత మమత విలేకరులతో మాట్లాడారు. "ఆందోళనకారులు నన్ను చంపాలని చూశారు. ఇనుపరాడ్తో కొట్టేందుకు యత్నించారు. కానీ, మా మంత్రి ఫర్హద్హకీమ్ నన్ను రక్షించారు. ఇలాంటి గూండాయిజాన్ని ఎన్నడూ ఊహించలేదు. నేను తలచుకుంటే పది లక్షల మందిని ఢిల్లీకి తేగలను. ఇది ప్రణాళికా సంఘం కార్యాలయం. ఇక్కడ రాజకీయ నిరసనలేమిటి? మా ఆర్థిక మంత్రిపై దాడి చేశారు. నన్ను చంపడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే వారి ధ్యేయం. నన్ను చంపితే తప్ప ఆపడం వారికి సాధ్యం కాదు'' అని స్పష్టం చేశారు. కాగా మమతా బెనర్జీ పైన దాడిని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లో సిపిఎం కార్యాలయాలపై దాడులు జరిగాయి.












Click it and Unblock the Notifications