మనోళ్లకు విజయ'నామా'లేనా!: నేతల భవిష్యత్తేంటి?
హైదరాబాద్: విజయనామ సంవత్సరంలో ఆయా పార్టీలు, పార్టీ ముఖ్య నేతల జాతకం బాగుందని సిద్దాంతులు చెబుతున్నారు. మొదట కొన్ని ఒడిదుడుకులు ఆ తర్వాత మంచి జరుగుతుందని చెబుతున్నారు. రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న నందమూరి హీరో బాలకృష్ణకు ఆరంభం అదుర్స్ అనిపిస్తుందని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడా బాగానే ఉంటుందని చెబుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజయవంతంగా దూసుకు వెళ్తారట. పథకాల వంటి అంశాల కారణంగా ప్రజల్లో ఆయన సక్సెస్ రేటు పెరుగుతుందట. అదే సమయంలో పార్టీలోనే కిరణ్ను వ్యతిరేకిస్తున్న వారి హవా తగ్గుతుందట. కిరణ్ జాతకం వల్ల రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుందట.
చిరంజీవి
చిరంజీవికి విజయనామ సంవత్సరంలో లాభము నష్టమూ రెండూ ఉండవట. ఆయన జాతకం సాదా సీదాగా మాత్రమే ఉందట. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణది అలాగే ఉందట.

బాలకృష్ణ
బాలకృష్ణకు ప్రస్తుతం రాహు మహాదశ ఉందట. అయితే, వచ్చే జూన్ నెల నుండి ఆయన జాతకం తిరిగిపోతుందట. వచ్చే జూన్ నుండి ఆ తర్వాత ఏడాద జూన్ వరకు బాలయ్య జాతకం విజయవంతంగా సాగుతుందట. జూన్లో ఆయనకు మంచి రోజులు వస్తాయట.
జూనియర్ ఎన్టీఆర్
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్కు సినిమాల్లో సక్సెస్ రేటు బాగుంటుందట. ఈ ఏడాది విజయవంతంగా దూసుకెళ్తారట.
కెసిఆర్
ఈ ఏడాద తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బాగా లేదంటున్నారు. ప్రస్తుతం బాగానే ఉంటుందట. అయితే వచ్చే జూన్ నుండి తర్వాత ఏడాది జూన్ వరకు కలిసి రాదట. రాను రాను కారు స్పీడు కాస్త తగ్గిపోతుందట.
తెలుగుదేశం
టిడిపికి ప్రస్తుతం రాహుదశ ఉంది. జూన్ నాటికి మంచి రోజులు వస్తాయట.
జగన్ - వైయస్సార్ కాంగ్రెసు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఏడాది జూన్ నుండి బాగుంటుందట. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు కూడా 2014లోనే మంచికాలం ప్రారంభమవుతుందట. జగన్ పార్టీకి జూన్ నుంచి మంచి రోజులు వస్తాయట.
మోడీకి అంతా మంచే...
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జాతకం బాగుందట. అయితే, ఆయన తన ప్రసంగాల విషయంలో జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు పదవీ గండం ఉందట. కాంగ్రెసు ముఖ్య నేతలు మారే అవకాశాలు ఉన్నాయట.
రాష్ట్రంలో ఉద్యమాలు, బందులు అనేవి ఉండకుండా ప్రశాంతంగా ఉంటుందట. సెప్టెంబర్, అక్టోబరులో వర్షాలు బాగానే కురుస్తాయి. నిత్యవాసర ధరలు తరుచూ పెరుగుతుంటాయి. రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. అయితే, వ్యక్తిగతంగా పలువురికి బాగుటుందట. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినా సర్దుకుంటాయట.
రాజకీయ అనిశ్చితి: స్వరూపానంద
విజయనామ సంవత్సరంలో గ్రహాల స్థితి బాగాలేదని, రాజకీయ అనిశ్చితి కొనసాగుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేశ్వర స్వామి అన్నారు. గ్రహస్థితిని బట్టి అక్టోబర్ తర్వాత భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తే పరిస్థితులున్నాయని, దేశం, రాష్ట్రం కష్టాల్లో ఉండవచ్చునన్నారు.
బిజెపి కార్యాలయంలో...
బిజెపి కార్యాలయంలో శ్రీ శంకరమంచి రామకృష్ణ సిద్ధాంతి పంచాంగ శ్రవణం వినిపించారి. విజయనామ సంవత్సరం సింహ లగ్నంలో ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాదికాలం దోషరహితంగా ఉంటుందని చెప్పారు. వ్యవసాయం, వ్యాపారం, రాజకీయ రంగాల్లో శుభపరిణామాలుంటాయన్నారు. వాతావరణం, భూ, సముద్ర ఉపద్రవాలు వస్తాయని చెప్పారు. వాటి నుండి తర్వాత ఉపశమనం కలుగుతుందన్నారు. దేశంలో, రాష్ట్రంలోను సమస్యలు వస్తాయని, అవి సర్దుకుంటాయన్నారు.
రవీంద్ర భారతిలో...
రవీంద్రభారతిలో జరిగిన పంచాంగ శ్రవణానికి కిరణ్, బొత్సతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. పండితులు పంచాంగ శ్రవణాన్ని చదివి వినిపించారు. ఈ ఏడాది ధరలు పెరుగుతాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. పాలకులకు ఒడిదుడుకులు ఉన్నా సుస్థిర పాలన అందిస్తారు. రాష్ట్రానికి నిధుల కొరత ఉండదు, దుబారా ఉంటుందన్నారు. పరిపాలనపై విమర్శలు ఎదురవుతాయని పండితులు తెలిపారు.












Click it and Unblock the Notifications