మచ్చలేని ఫ్యామిలీ: సబితకు మోహన్బాబు పరామర్శ
అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఇంద్రా రెడ్డి తనకు తమ్ముడితో సమానమని మోహన్ బాబు చెప్పారు. సబితా రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావడం తనను బాధించిందన్నారు. సబితా రెడ్డి కుటుంబానికి ఎలాంటి మచ్చలేనిదన్నారు. తప్పులు ఢిల్లీ నుండే జరిగాయని ఆయన అన్నారు.
జగన్ కేసులో ఐదో ఛార్జీషీటులో ఎ4గా సబితా ఇంద్రా రెడ్డి పేరు ఉండటంతో ఇటీవల ఆమెను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలు పరామర్శిస్తున్నారు. ఆమె రాజీనామా చేయాలని భావించారు. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలతో పాటు మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ఆమె రాజీనామా చేయవద్దని కోరారు. ఈ నేపథ్యంలో ఆమె వెనక్కి తగ్గారు.
మరోవైపు సబితా ఇంద్రారెడ్డి భవిష్యత్తు అయోమయంలో పడినట్లే. సబితా ఇంద్రారెడ్డిని హోం మంత్రిత్వ శాఖ నుంచి తప్పిస్తారనే మాట వినిపిస్తోంది. ఆ శాఖ నుంచి తప్పించి మరో శాఖను అప్పగిస్తారా, శాఖలేని మంత్రిగా కొనసాగిస్తారా అనేది కూడా అయోమయంగానే ఉంది. ఏమైనా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సబిత భవిష్యత్తు తేలనుంది.
సోనియా శుక్రవారం స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోబోరని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు పంపించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ బుధవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆచితూచి స్పందించారు. చార్జిషీటులో సబితపై ఏ అభియోగాలున్నదీ తాను చూడలేదని, సిబిఐ ఈ చార్జిషీటుపై కోర్టు స్పందన కూడా చూడాల్సి ఉందని అన్నారు. అన్నీ అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు.