విలువల్లేవు, రిజైన్ వెనక్కి: కావూరి, కెసిఆర్పై ఎద్దేవా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన తాజా చార్జిషీటులో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేరు ఉండడం పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే విషయమేనన్నారు. గతంలో మంత్రి ధర్మాన ప్రసాద రావు విషయంలో ఎలా వ్యవహరించారో సబిత విషయంలోనూ అలాగే వ్యవహరించే అవకాశముందన్నారు. గతంలో రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేసిన కావూరి ఇప్పట్లో అలాంటి నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని విద్యుత్ సమస్యకు ప్రణాళిక, చిత్తశుద్ధి లోపించడమే అన్నారు. తెలంగాణకు దివంగత ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిర గాంధీలే అన్యాయం చేశారన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఏం మాట్లాడినా ఆయనకే చెల్లుతుందన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేవత అని, ఆమె ఒక్కరే తెలంగాణ ఇవ్వగలరని, కాంగ్రెస్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కూడా కెసిఆర్ గతంలో చెప్పారన్నారు.
తెలుగు నేల మీద ఉన్న వారంతా కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల విదేశాల్లో పర్యటించిన కావూరు ఆయా దేశాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ఇళ్ల పథకంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. పేదలకు ఉచిత ఇళ్లను కల్పించడం వల్ల ప్రభుత్వానికే ఏడాదికి సుమారు రూ.45వేల కోట్ల ఆదాయం వచ్చే పథకాన్ని సూచిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు కావూరు లేఖ రాశారు. ప్రణాళికాసంఘం డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్సింగ్ అహ్లువాలియాకు, రాహుల్గాంధీలకు కూడా ఈ లేఖ ప్రతిని పంపారు.