జగన్ పార్టీ మెరుగ్గా ఉన్నా మనమే కీలకం: కెసిఆర్
తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీ ప్రసాద రావు, విఠల్ తదితరులు గురువారం కెసిఆర్ను ఆయన నివాసంలో కలిశారు. వారి రెండు గంటలకు పైగా వారు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కెసిఆర్... వచ్చే ఎన్నికల్లో పొత్తు అంశంపై వారితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. బిజెపితో పొత్తు ఇప్పుడు కాదని, ఎన్నికలయ్యాకే అని చెప్పినట్లుగా సమాచారం.
అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ఆర్థికబిల్లు ఆమోద సమయంలో కేంద్రానికి సమాజ్వాదీ పార్టీ మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నారు. కేంద్రంపై కోపంగా ఉన్న అన్ని పక్షాలు ఒక్కటైతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేదశలో యూపీఏ-2 సర్కారు ఎప్పుడైనా కూల్చవచ్చునని కెసిఆర్ అభిప్రాయపడ్డట్లుగా సమాచారం.
ఐరాస ఉద్యమ కార్యాచరణ ఎన్నికల దృష్టిలోనే ఉండాలని సూచించారు. మే నెలలో చలో అసెంబ్లీని పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటానికి ముందు తెరాస ఆధ్వర్యంలో హైదరాబాద్లో 25 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పారట. ఈసారి ఎన్నికల్లో తెరాసకు 15 లోక్సభ, 100 అసెంబ్లీ స్థానాలు వస్తాయనే ధీమాను కెసిఆర్ వ్యక్తం చేశారు.
సీమాంధ్రలో జగన్ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ ఆ పార్టీకి రాదని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీకీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాదని, అక్కడా, ఇక్కడా హంగే ఏర్పడుతుందని, రెండు చోట్లా తెరాసనే కీలకమవుతుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలను సూచించారట. ఐకాస తలపెట్టిన సంసద్ యాత్ర వాయిదా వేస్తే కెసిఆర్ స్వయంగా పాల్గొనేందుకు సానుకూలంగా స్పందించారు.
సంసద్ యాత్రకు సలహాలు ఇచ్చారు: కోదండ
కెసిఆర్తో భేటీ అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. సంసద్ యాత్రకు ఢిల్లీలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించటానికి అవసరమైన సూచనలు, సలహాలను కెసిఆర్ ఇచ్చారని చెప్పారు. శుక్రవారం భాగస్వామ్య బిజెపినేతలను కూడా కలిసి చర్చిస్తామన్నారు.