సర్దుకుంది!: ఉగాది వేడుకలో విజయమ్మతో నటి రోజా
ఉగాది పర్వదినం సందర్భంగా మారేపల్లి రామచంద్ర శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 230 స్థానాలలో విజయం సాధిస్తుందని, పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పేరులోనే విజయం ఉందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో బయటకు వస్తారని చెప్పారు.
గందరగోళం తర్వాతే స్థిరత్వం వస్తుందని చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం ఉండవని చెప్పారు. పార్టీకీ భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉందన్నారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, కొత్త ఫ్రంట్లు ఏర్పడతాయని చెప్పారు. ప్రజల పక్షాన ఉన్న వారినే విజయం వరిస్తుందన్నారు. ఈ ఏడాది కష్టాలు వచ్చినా తర్వాత ప్రజలకు సుఖశాంతులుంటాయన్నారు.
ప్రజలు సంతోషంగా ఉండాలని విజయమ్మ ఆకాంక్షించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉగాది పండుగకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారని, ఎప్పుడైనా ఇల్లు మారాల్సి వస్తే ఉగాది పండుగ తర్వాత వచ్చే మంచిరోజు మారుదామని చెప్పే వారన్నారు. విజయనామ సంవత్సరంలో అందరికీ మేలు జరగాలన్నారు.