జగన్ నా గదిలో అడుగుపెట్టలేదు: జైలు సూపరింటెండెట్
గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జైలు సూపరింటెండెంట్ జగన్ సేవలో తరిస్తున్నారని, ఉదయం నుంచి సాయంత్రం వరకు సూపరింటెండెంట్ కుర్చీలో జగన్ కూర్చుని రోజూ 400 మందిని కలుస్తున్నారని టిడిపి నేత వర్ల రామయ్య వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. జగన్ను సగటున రోజుకు కనీసం ముగ్గురు సందర్శకులు కలిసినట్లుగా నిరూపిస్తే ఏ క్రమశిక్షణ చర్యలకైనా నేను సిద్ధమన్నారు.
జైలు సిబ్బంది జగన్కు శాటిలైట్ ఫోన్లు ఇస్తున్నారని, జైలులో ఖైదీలకు జగన్కు పంపే వంటకాలను వడ్డిస్తున్నారని చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. జగన్కు, మరో ఐదుగురు ప్రత్యేక ఖైదీలకు జైళ్ల నిబంధనావళిలో నిర్దేశించిన వసతులు మాత్రమే కల్పిస్తున్నామన్నారు. బయటి నుంచి ఎటువంటి ఆహార పదార్థాలను అనుమతించడం లేదని చెప్పారు. భద్రతరీత్యా రాష్ట్రంలోని ప్రధాన జైళ్లలో పవర్ డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జైలులో కరెంట్ పోయిన వెంటనే జనరేటర్ వేస్తామని ఈ విషయంలో జగన్కు ఎటువంటి ప్రత్యేకత లేదన్నారు. జైలులో సూపరింటెండెంట్ కార్యాలయం మేడ మీద ఉంటుందని, జగన్ ఇప్పటి వరకు మెట్లు ఎక్కి తన గదిలోకి ప్రవేశించలేదని చెప్పారు. జైలులో నాలుగు నెలల క్రితం సిసి టీవీ కెమెరా రికార్డింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి జైలులోకి ప్రవేశించిన వారందరినీ రికార్డింగ్లో నిక్షిప్తం చేసినట్లు చెప్పారు.
జైలులో జగన్ను ఉంచిన ప్రదేశం జైలు శాఖ ఉన్నతాధికారులు ఉండే ప్రధాన కార్యాలయం పక్కగా ఉంటుందని, అందువల్ల ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చిన వాహనాలు ఆ దరిదాపులకు వెళ్లే అవకాశం లేదని తెలిపారు. మరొకసారి నిరాధార ఆరోపణలు చేస్తే చటరీత్యా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని టిడిపి నేతలను హెచ్చరించారు.