కెసిఆర్ కాళ్లు పట్టుకునేవాడే సిఎం: బైరెడ్డి వ్యాఖ్య
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో 90 ఎమ్మెల్యే స్థానాలు, 13 లోక్సభ స్థానాలను తెరాస కైవసం చేసుకోనుందని సర్వేలు చెబుతున్నాయని, అలా జరిగితే కెసిఆర్ కాళ్లు పట్టుకునేవాడే ముఖ్యమంత్రి అవుతాడని, ఆయన చెప్పుచేతల్లో ప్రభుత్వం నడవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని బైరెడ్డి రాయలసీమ నేతలను హెచ్చరించారు. ఆ పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు పార్టీలకతీతంగా రాయలసీమవాసులు ఏకమై ఆర్పీఎస్ను బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు.
రాయలసీమ వెనుక బాటుతనం, సాగునీరు, తాగునీరు, కరువు, వలసలు వంటి సమస్యలు ఎందువల్ల ఏర్పడ్డాయో వివరిస్తూ ఆర్పీఎస్ శనివారం నుంచి మేలుకొలుపుయాత్ర చేపట్టిందన్నారు. ఈ యాత్రకు వేలాదిగా తరలి రావాలని బైరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ, రాయలసీమ సరిహద్దుల్లోని పంచలింగాల నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రాక్టర్ యాత్ర నాలుగు నెలల పాటు రాయలసీమలోని అన్ని ప్రాంతాలకు వెళుతుందన్నారు.
కొందరు రాయలసీమ ప్రాంత నేతలు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తూ పాదయాత్రలు చేస్తున్నారని, ఏసీ బస్సుల్లో ఉండి పాదయాత్ర చేస్తే ఓట్లు రాలవని అన్నారు. ఈ మాటలు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు. రాయలసీమలో కుటుంబం పాలన కొనసాగుతోందని, 42 కుటుంబాలకు చెందిన వారే ఈ ప్రాంతంలో పెత్తనం చెలాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.