ఫ్లెక్సీ పోరు: జగన్ వస్తే వేట మొదలు, బంధిస్తే రక్ష
నూజివీడు మండలం గొల్లపల్లిలో రాజశేఖర్రెడ్డి విగ్రహావిష్కరణకు షర్మిల వస్తున్న సందర్భంగా జగన్ను పులితో పోలుస్తూ, 'పులిని బోనులో పెట్టి ఆడుతున్నారు మీరు ఆట', 'బయటకు వచ్చిన తరువాత మొదలవుతుంది వేట' అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందుకు ప్రతిగా తెలుగుదేశం ఆధ్వర్యంలో జగన్ అవినీతిని ప్రస్తావిస్తూ భారీ ప్లెక్సీని ఏర్పాటు చేశారు.
'అరణ్యాల్లో తిరిగే సింహాన్ని బోనులో బంధిస్తే అరణ్యంలో తిరిగే సకల ప్రాణులకు రక్షణ', 'అదే జనారణ్యంలో తిరిగే మానవ మృగాలను చట్టంతో బంధించకుంటే మానవజాతి మనుగడకే ముప్పు', 'చేసింది ఏదో ఘనకార్యమైనట్టు క్రూరమృగాల పేర్లుపెట్టి వెర్రి పోలికలతో చట్టాన్ని అపహాస్యం చేయడం కూడా నేరమే'నంటూ తెలుగుదేశం పోటీ ప్లెక్సీలు ఏర్పాటు చేసింది.
తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఫ్లెక్సీలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీని తొలగింపజేశారు. ఇంతకు ముందు విజయవాడలో షర్మిల పాదయాత్ర సందర్భంగా రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీల యుద్ధం సాగిన విషయం తెలిసిందే.