ఒడిషాలో ఎలక్షన్ ట్రయల్ చేస్తే బాగు: బాబుపై సిఎం
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ట్రయల్ ఒడిషాలో చేస్తే మంచిదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయి ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్కు వ్యతిరేకంగా శాసనసభలో ఓటేశాయని ఆయన విమర్శించారు. అధికారంలో లేకపోయినా చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని ఆయన అన్నారు.
ఎస్టీ, ఎస్సీల సబ్ ప్లాన్ కన్నా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పాదయాత్రే ముఖ్యమని, అందుక అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదని ఆయన విమర్శించారు. ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్కు ప్రతిపక్షాలు సహకరించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దళితులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు ఇలాంటి పనులు చేయలేకపోయారని కిరణ్కుమార్రెడ్డి అడిగారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం గుంటూరుజిల్లా, ఫిరంగిపురంలో పర్యటనకు వచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎస్టీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని అన్నారు. పేద ప్రజలపై చార్జీలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ విషయాన్ని విపక్షాలు రాజకీయ లబ్దికోసం రాద్దాంతం చేస్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు చక్కగా అమలు జరిగేలా మంత్రులు, ఎమ్మెల్యేలు చూడాలని, అలాగే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని కిరణ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, అధికారం తమదేనని కిరణ్ రెడ్డి అన్నారు.
తెనాలిలో జరిగిన ఈవ్టీజింగ్ ఘటనను ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఖండించారు. మనుషుల్లో మానవత్వం, అభిమానం ఉండాలని, మహిళల పట్ల గౌరవం ఉండాలని అన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు.
అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్...
కాగా శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హైదరాబాద్లో పార్క్ హయత్ హోటల్లో ప్రపంచ పర్యాటక సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి చిరంజీవి, మంత్రి వట్టివసంత్కుమార్, టూరిజం కార్యదర్శి 29 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా సీఎం కిరణ్కుమార్రెడ్డి మాట్లాడారు. పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అధిక నిధులను ఖర్చు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పలు అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక, ఐటీ, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హైదరాబాద్ కేంద్ర కానుందని ఆయన అన్నారు.