కెసిఆర్ బంపర్ ఆఫర్: వివేక్ డైలమా, కెకెతో బొత్స
దళితుల్లో బడా పారిశ్రామికవేత్త అయిన వివేక్ పార్టీలోకి వస్తే పార్టీకి ఎనలేని బలం సమకూరుతుందని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వివేక్ ద్వారా ఓ వర్గం పార్టీలోకి వస్తుందని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అయితే, వివేక్ మాత్రం డైలమాలో పడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసును వదులుకుంటే తన పెట్టుబడులపై ఏమైనా వివాదాలు ముందుకు వస్తాయా అనే ఆలోచనలో ఆయన పడినట్లు చెబుతున్నారు. అయితే, తాను తెరాసలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అయినా, ఆయన తెరాసలోకి వెళ్లే విషయాన్ని తోసిపుచ్చలేమని అంటున్నారు.
రంగంలోకి దిగిన బొత్స..
తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెరాసలోకి వెళ్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఆయన కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావుతో ఫోనులో మాట్లాడినట్లు తెలుస్తోంది. తెరాసలో చేరే విషయంపై కెకె కూడా ఆలోచన చేస్తున్నట్లు, కెకెను కెసిఆర్ తెరాసలోకి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ఇవ్వనప్పుడు వేరే మార్గం లేదని కేశవరావు బొత్సను అడిగినట్లు తెలుస్తోంది. మిగతా పార్లమెంటు సభ్యులతో బొత్స సత్యనారాయణ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
చావో రేవో తేల్చుకుంటాం: కెసిఆర్
తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ కెసిఆర్తో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాము చావో రేవో తేల్చుకుంటామని కెసిఆర్ ఈ సందర్భంగా అన్నారు. తమ పార్టీలో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడేవారినే పార్టీలో చేర్చుకుంటామని ఆయన చెప్పారు.
తెలంగాణ సాధన తెలుగుదేశం పార్టీతో సాధ్యం కాదని గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే సత్తా తెరాసకు మాత్రమే ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ తెరాస అని ఆయన అన్నారు.