అధిష్టానం వ్యూహమే: జగన్తో పాటు వైయస్ టార్గెట్
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు మంత్రి బాలరాజు చెప్పారు. వైయస్ జగన్ అవినీతికి మంత్రులు బలయ్యారని ఆయన సోమవారం విమర్శించారు. దళిత, గిరిజన ఉప ప్రణాళికపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో తాము చర్చకు సిద్ధమని ఆయన చెప్పారు. 2004 నుంచి 2009 వరకు వైయస్ హయాంలో దళిత, గిరిజన నిధులు దారి మళ్లాయని, వాటిని హుసేన్ సాగర్ ప్రక్షాళన, ఔటర్ రింగ్ రోడ్లకు మళ్లించారని బాలరాజు ఆరోపించారు.
వైయస్ రాజశేఖర రెడ్డికి ఎస్సీ, ఎస్టీలపై ప్రేమ లేదని మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పాటు పడుతున్నారని ఆయన శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై కొండ్రు మురళి ఇదే రకమైన విమర్శ చేసినప్పుడు కాంగ్రెసులో తీవ్ర దుమారం చెలరేగింది.
తెర వెనక ఒప్పందాలకు మంత్రులు బలయ్యారని మరో మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకే ఆనాడు మంత్రులు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు. నాడు వైయస్ మంత్రివర్గంలో ఉన్నందుకు నేడు మంత్రులు విచారణను ఎదుర్కుంటున్నారని ఆయన అన్నారు. తెర వెనక జరిగిన వ్యవహారాలతో మంత్రులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. వైయస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలను జగన్ తన వ్యాపారాలకు వాడుకున్నారని ఆయన అన్నారు.