వాజపేయిలా ఉండాలి: 'పిఎం'పై మోడీకి నితీష్ చురక
"ప్రధాని అభ్యర్థి పక్కా లౌకికవాది అయి ఉండాలి. రాజనీతిజ్ఞుడు కావాలి. వెనకబడిన రాష్ట్రాలు, ప్రాంతాల అభివృద్ధిపై శ్రద్ధ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వాజ్పేయి వంటి వ్యక్తి కావాలి. ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఎన్నికలకు ముందే.. అంటే ఈ ఏడాది చివర్లోనే ప్రకటించాలి. రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఎన్డీయే జాతీయ అజెండాకు కట్టుబడి ఉండాలి'' అని జెడి(యు) తన రాజకీయ తీర్మానంలో స్పష్టం చేసింది.
రాష్ట్రంలో రాజధర్మాన్ని పాటించని వ్యక్తి ప్రధాని పదవికి తగడని స్పష్టం చేసింది. ఎన్డీయేలో అతి పెద్ద పార్టీ బీజేపీయే కనక ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడానికి ఆ పార్టీకి ఎనిమిది నెలల గడువు కూడా ఇచ్చింది. తమ షరతులను పరిగణనలోకి తీసుకునే ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేయాలని రాజకీయ తీర్మానంలో ఘాటుగా తేల్చి చెప్పింది. తమ మాట వినకపోతే రాం రాం తప్పదని హెచ్చరించింది.
ప్రధాని పదవి రేసులో లేనంటూనే...
దేశానికి ఇప్పుడు వాజ్పేయి వంటి ఆలోచన సరళి ఉన్న వ్యక్తి నాయకత్వం అవసరమన్నారు. బీహార్లో తాను కూడా అన్ని వర్గాలనూ ఏకతాటిపై ఉంచానని, లౌకిక వాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నానని చెప్పారు. మరోవైపు తాను ప్రధాని రేసులో లేనని చెబుతూనే తనకు ఆ ఆర్హతలున్నాయని చెప్పారు. "కాంగ్రెస్ మాకు శత్రువు. దానితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. బిజెపితో కలిసే ఉంటాం. ప్రధాని అభ్యర్థి అద్వానీ అయితే ఓకే. బిజెపి మోడీ తమ ప్రధాని అభ్యర్థి అని ప్రకటిస్తే.. ఎన్డీయేకూ రాం రాం చెబుతాం. తటస్థంగా ఉంటాం. మా అర్జునుడు మాకు ఉండనే ఉన్నాడు'' అని జెడి(యు) తేల్చి చెప్పింది.
మోడీపై పరోక్ష విమర్శలొద్దు: బిజెపి
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి జెడి(యూ) చేసిన వ్యాఖ్యలపై బిజెపి అసంతృప్తి వ్యక్తం చేసింది. మోడీపై పరోక్ష విమర్శలు చేయవద్దని బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ హితవు పలికారు. యుపిఏను గద్దె దింపడంపై కాకుండా సాటి సిఎంలపై విమర్శలు గుప్పించడానికే ఎన్డీయే మిత్రపక్షాలు తమ శక్తియుక్తులను వినియోగించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి మోడీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ముందు మాతో చెప్పాలి: శివసేన
ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా బిజెపి ఎవరిని ప్రకటించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కాకపోతే, ప్రకటించే ముందు భాగస్వామ్య పక్షంగా తమతో సంప్రదించాలని శివసేన నేత రాహుల్ నార్వేకర్ చెప్పారు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించిన తర్వాత దానిపై తాము నిర్ణయం తీసుకుంటామని మెలిక పెట్టారు. ఎన్డీయేలోని అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని శిరోమణి అకాలీ దళ్ సూచించింది.