రాహుల్తో కిరణ్, బొత్స భేటీలో తెలంగాణపై చర్చ
తెలంగాణ అంశంపైనే కాకుండా రాష్ట్రంలో పార్టీ పునర్వ్యస్థీకరణ, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా అంశాలపై రాహుల్ గాంధీ వారితో మాట్లాడే అవకాశాలున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చార్జిషీట్లో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును నిందితురాలిగా చేర్చిన విషయం తెలిసిందే.
పిసిసి అధ్యక్షుడి మార్పు కూడా ఉండవచ్చుననే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒక వ్యక్తికి ఒకే పదవి అంశంపై రాహుల్ గాంధీ బొత్స సత్యనారాయణతో మాట్లాడే అవకాశాలున్నాయి. బొత్స పిసిసి అధ్యక్షుడిగా, రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. బొత్స సత్యనారాయణ మాత్రం పిసిసి అధ్యక్షుడిగానే కొనసాగడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం. అయితే, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ అంశాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగానే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత తెలంగాణపై ఓ నిర్ణయం వెలువరించే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు తెరాసలోకి బారులు తీరుతున్నందున తెలంగాణపై ప్రకటనకే రాహుల్ గాంధీ మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.