నమస్కారం!: జగన్ లాయర్, సిబిఐ జెడి మధ్య వాదన
సిబిఐ అధికారుల గురించి సుశీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై జెడి తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును సిబిఐ తనకు అనుకూలంగా అన్వయించుకుంటోందని, కౌంటర్లు దాఖలు చేసిందని, వాటిపై సిబిఐ జెడి, డిఐజి, ఎస్పీ, డిఎస్పీ ఎవరు సంతకాలు చేశారో తెలియదు కానీ, కోర్టు తీర్పును వారు తమకు అన్వయించుకుని అర్థం చేసుకున్నట్లు ఉందని సుశీల్ కుమార్ వ్యాఖ్యానించారు.
దీంతో కోర్టు హాలులోనే ఉన్న జెడి లక్ష్మీ నారాయణ ఒకింత ఆగ్రహంగా బదులిచ్చారు. 'మీరు సిబిఐపై ఏదైనా మాట్లాడాలనుకుంటే కోర్టులోనే (జడ్జి ముందు) మాట్లాడండి. మా న్యాయవాది వాదనలు వినిపిస్తున్నప్పుడు కూడా మీరు ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. వాటి పట్ల నాకు సంతృప్తి లేదు. మీరలా అనడం బాగాలేదు. మీరు పెద్దవారు! మీ వయసుకు నమస్కారం పెడతాను. కానీ, మీ మాటల్ని ఆమోదించలేను'' అన్నారు.
'మీరు నా గురించి మాట్లాడండి! మా అధికారులను ఏమీ అనొద్దు' అని పేర్కొన్నారు. దీంతో సుశీల్ జెడికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 'నేను నా విధి నిర్వర్తిస్తున్నాను. మీరు విధిని నిర్వర్తిస్తారు. కామెంట్స్ను నవ్వి వదిలేయాలి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని తెలిపారు. దీంతో ఈ సంవాదం సద్దుమణిగింది.