కెసిఆర్కు కెకె హ్యాండ్: కాంగ్రెసు ఎంపిల జంప్స్ 'నో'

తాము ఉద్యమ పార్టీలో చేరుతామని, తెరాస ఒక్కటే తెలంగాణ కోసం ఉద్యమిస్తోందని కేశవ రావు ఇంతకు ముందు వ్యాఖ్యానించారు. దాన్ని బట్టి తెరాసలో చేరేందుకు కేశవ రావు మానసికంగా సిద్ధమైనట్లు భావించారు. దీంతో కేశవరావుతో తెరాస శాసనసభ్యుడు హరీష్ రావుతో పాటు మరికొంత మంది నాయకులు చర్చలు జరిపారు. తమ పార్టీలో చేరడానికి కెసిఆర్ ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు ఈ నెల 27వ తేదీని గడువుగా పెట్టారు. ఆ తర్వాత ఎవరు వచ్చినా చేర్చుకోబోమని చెప్పారు.
కెసిఆర్ విధించి గడువులోగానే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెరాసలో చేరుతారని భావించారు. కానీ, కేశవ రావు తాజా వ్యాఖ్యలను బట్టి అది వట్టి మాటేనని అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులే జైలుకు వెళ్లారని, తెరాస నేతలు జైలుకు వెళ్లలేదని ఆయన గురువారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ కోసం తమ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
తమ పార్టీ ఎంపీలు తమకు తామే గడువులు పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటాలు చేస్తారని చెప్పారు. ప్రజా ఉద్యమాల్లోకి వారు వెళ్తారని చెప్పారు. తెలంగాణ కోసం తమ ప్రయత్నాలు సొంతంగానే చేస్తామని చెప్పారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఈ మాటలను బట్టి కేశవ రావు గానీ, ఇతర పార్లమెంటు సభ్యులు గానీ తెరాసలో చేరే అవకాశాలు లేవని అర్థమవుతోంది.
ఇదిలా వుంటే, రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీలో సీనియర్ తెలంగాణ మంత్రి జానారెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి వివరిచారు. మే నెలలో తెలంగాణపై నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. జానా రెడ్డి ప్రకటనకు కేశవరావు కెసిఆర్కు చేయి ఇవ్వడానికి పొంతన ఉందని భావిస్తున్నారు. తెలంగాణపై మేలో నిర్ణయం ప్రకటిస్తామని పార్టీ అధిష్టానం చెప్పడం వల్లనే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెరాసలో చేరడానికి ముందుకు రాలేదని అంటున్నారు.
తెరాస అధ్యక్షుడిగా కెసిఆర్ ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడిగా కె. చంద్రశేఖర రావు గురువారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కెసిఆర్ తప్ప మరొకరు అధ్యక్ష పదవికి నామినేషన్ వేయలేదు. దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ఈ నెల 27వ తేదీన ఆర్మూరులో జరిగే ప్రతినిధుల సభలో అధికారికంగా ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications